బోటు బోల్తా ఘటనలో ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మూడు రోజులు గడుస్తున్నా.. ఆరుగురు మత్స్యకారులకు సంబంధించి ఎలాంటి ఆచూకీ లభించలేదు. దాదాపు మూడు రోజులు గడుస్తోంది. బోట్లు, చాపర్లతో సెర్చింగ్ నడుస్తోంది. అయితే.. ఈ ఘటన నుంచి ప్రాణాలతో బయటపడ్డ బోటు డ్రైవర్ కారె చిన్న ఎట్టకేలకు రెండు రోజుల తర్వాత విశాఖకు చేరుకున్నాడు. INS డేగా నుంచి చిన్నను హెలికాప్టర్లో కార్గో షిప్లోకి సురక్షితంగా తరలించారు నేవీ సిబ్బంది. కార్గో షిప్ నుంచి చిన్నాను విశాఖకు తీసుకొచ్చారు. విశాఖలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. చిన్నను ఆయన భార్య, కుటుంబ సభ్యులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా.. నడిసముద్రంలో ప్రాణాల కోసం సాగిన భీకర పోరాటాన్ని కారె చిన్న కళ్లకు కట్టాడు. కళ్ల ముందే తన వాళ్లందరినీ కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడిన కారె చిన్న మాటల్లో ఆ నరకప్రాయమైన రాత్రి ఎలా సాగిందో అర్థమవుతోంది.
అసలేం జరిగిందంటే..
ఆదివారం మధ్యాహ్నం పన్నెండున్నరకు వేట ముగించుకుని వెనుతిరుగుతుండగా భారీ అల రూపంలో పెను ప్రమాదం వచ్చి పడిందని కారె చిన్న వివరించాడు. తీరానికి కేవలం పది మైళ్ల దూరంలో వచ్చిన భారీ అల జీవితాలను తలకిందులు చేసిందన్నాడు. బోటు బోల్తా పడిన క్షణంలోనే ఒకరు గల్లంతవగా.. మిగిలిన ఆరుగురం బతకాలనే ఆశతో రాత్రి 9 గంటల వరకు మునిగిపోతున్న బోటును పట్టుకునే ఈదామని చెప్పాడు. కానీ.. బోటు పూర్తిగా మునిగిపోవడంతో రెండో వ్యక్తి కూడా సముద్ర గర్భంలో కలిసిపోయాడన్నాడు. ఆ తర్వాత.. ఐదుగురం ప్రాణాలు కాపాడుకోవడానికి బోటు లోపలి నుంచి నీటిపై తేలియాడే వల పోర్సులను తెచ్చుకుని నడుముకు కట్టుకుని రాత్రంతా దిక్కుతోచని స్థితిలో ఈదుతూనే ఉన్నామని చెప్పాడు. ఇలా గంటలపాటు శక్తి కొద్దీ ఈదిన తర్వాత తెల్లవారుజామున ఒక పెద్ద షిప్ కనిపించడంతో ఆశలు చిగురించాయనన్నారు. కానీ.. అప్పటికే అలసట చెందడంతో ఇక తాను ఈదలేను అంటూ ఒకరు వెనకబడిపోగా.. నౌక వైపు వెళ్లే క్రమంలో శక్తి నశించి మరో ముగ్గురు కూడా సముద్రపు అలల్లో కలిసిపోయారని కారె చిన్న చెప్పడం గుండెలు పిండేస్తోంది.
చివరకు ప్రాణాల మీది ఆశతో చిన్న ఒక్కడే ముందుకు సాగి ఓ మర్చంట్ నౌక యాంకర్ గొలుసును పట్టుకున్నానన్నాడు. అది పైకి లాగుతున్నప్పుడు భయంతో వదిలేసి.. కాపాడాలంటూ కేకలు వేయడంతో నౌక సిబ్బంది లైఫ్ జాకెట్ విసిరి పైకి లాగారని చెప్పాడు. ఎట్టకేలకు కారె చిన్న ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ తర్వాత.. నౌక కెప్టెన్ సమాచారంతో అధికారులు చిన్నకు సపర్యలు చేసి విశాఖకు రప్పించారు. ఈ క్రమంలోనే.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్న.. తాను బతికాను కానీ.. కళ్ల ముందే బంధువులైన ఆరుగురు సహచరులను కోల్పోవడం, జీవనాధారమైన బోటు మునిగిపోవడంతో తనకేమీ మిగల్లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేయడం కన్నీళ్లు పెట్టిస్తోంది. మరోవైపు.. మిగతా ఆరుగురి పరిస్థితి ఏంటన్నదే ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది. సాధారణంగా సముద్ర ప్రమాదాల్లో 72 గంటల సమయం అత్యంత కీలకం.. 72 గంటల పాటు గాలింపు చర్యలు జరిపి, ఆ తర్వాత ఆపరేషన్ను నిలిపివేస్తారు. రెస్క్యూ టీమ్ ఇచ్చే ఫైనల్ రిపోర్ట్ ఆధారంగా మత్స్యకారుల గల్లంతుపై అధికారులు ప్రకటన చేయనున్నారు.
మొత్తంగా.. కారె చిన్న మాటల్లో నడిసముద్రంలో సాగిన పోరాటం వింటుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది. 9 గంటల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సముద్రపు అలలపై ఈదడం.. ఆ సమయంలో ఆ ఏడుగురి గుండెల్లో ఎంతటి భయం, బతకాలనే ఎంతటి ఆరాటం ఉండి ఉంటుందో ఊహించడమే కష్టం. ఏదేమైనా.. ప్రకృతి ప్రకోపానికి, బతకాలనే మనిషి సంకల్పానికి మధ్య జరిగిన దారుణ ఘటనకు ఇదో నిదర్శనంగా నిలుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
