తాజావార్తలు

విద్యుత్‌ షాక్‌తో ఏనుగు మృతి.. సమగ్ర విచారణకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశం


చిత్తూరు జిల్లా మంగళంపేట అటవీ ప్రాంత పరిధిలోని పాపిరెడ్డిగారిపల్లె తీవ్ర విషాదం వెలుగు చూసింది. అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ఓ మామిడి తోటలో మగ ఏనుగు ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందింది. ఏనుగు మృతి చెందిన విషయాన్ని గుర్తించిన అధికారులు ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. అయితే విద్యుత్‌ షాక్‌ కారణంగానే ఏనుగు మృతి చెంది ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. మామిడి తోటలోని బోర్‌వెల్‌ మోటార్‌కు అనుసంధానించిన విద్యుత్‌ తీగ తక్కువ ఎత్తులో ఉండటం ప్రమాదానికి కారణమై ఉండొచ్చని తెలిపారు. ఆ సమయంలో విద్యుత్‌ సరఫరా ఉండటంతో.. ఏనుగు ఆ తీగను తాకి విద్యుదాఘాతానికి గురై ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

ఘటనపై పవన్‌ కల్యాణ్‌ ఆరా

మగ ఏనుగు మృతి చెందిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ విచారం వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను అటవీ శాఖ ఉన్నతాధికారుల ద్వారా తెలుసుకున్నారు. ఏనుగు ఎలా విద్యుత్‌ షాక్‌కు గురైంది..? తక్కువ ఎత్తులో విద్యుత్‌ తీగ ఎలా ఉంది..? అనే అంశాలపై సమగ్రంగా విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. ఏనుగు మృతి ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి.. కారణాలను నిర్ధారించాలని పవన్‌ కల్యాణ్‌ సూచించారు. విచారణ అనంతరం సమగ్ర నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

నిబంధనల ప్రకారమే అంత్యక్రియలు

మృతి చెందిన ఏనుగుకు వన్యప్రాణి నిబంధనలు, నిర్దేశిత ప్రోటోకాల్‌ ప్రకారం పోస్టుమార్టం నిర్వహించాలని పవన్‌ కల్యాణ్‌ ఆదేశించారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత నిబంధనల ప్రకారం ఏనుగును ఖననం చేయాలని సూచించారు. వన్యప్రాణుల మృతికి సంబంధించిన ప్రక్రియలో ఎలాంటి నిబంధనల ఉల్లంఘనకు తావులేకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు.

మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా..

అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల సంచారం సాధారణం. అలాంటి ప్రాంతాల్లో విద్యుత్‌ లైన్లు, తీగలు వన్యప్రాణులకు ప్రమాదంగా మారకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో విద్యుత్‌ తీగలు తగినంత ఎత్తులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పవన్‌ కల్యాణ్‌ అధికారులను ఆదేశించారు. విద్యుత్‌ శాఖతో సమన్వయం చేసుకుని ప్రమాదకరంగా ఉన్న విద్యుత్‌ లైన్లను గుర్తించాలని సూచించారు. అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న తోటలు, వ్యవసాయ క్షేత్రాల్లో విద్యుత్‌ కనెక్షన్ల పరిస్థితిని పరిశీలించాలని తెలిపారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

గజరాజుల రక్షణపై దృష్టి

వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా వాటి ఆవాస ప్రాంతాలు, సంచరించే మార్గాల్లో ప్రమాదకర పరిస్థితులను ముందుగానే గుర్తించడం కీలకం. ఒక చిన్న నిర్లక్ష్యం కూడా వన్యప్రాణుల ప్రాణాలకు ముప్పుగా మారకుండా అటవీ, విద్యుత్‌ శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. చిత్తూరులో జరిగిన ఈ ఘటనపై విచారణ నివేదికలో అసలు కారణాలు వెలుగులోకి రానున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చయండి,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *