రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ప్రస్తుత కాగితపు కరెన్సీ నోట్ల స్థానంలో ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎప్పటినుంచో దీని గురించి చర్చ జరుగుతుండగా.. ఇటీవల ఆర్బీఐ కూడా దీనిని ధృవీకరించింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన చర్చల దశలో ఉందని అంగీకరించింది. గతంలో కూడా ప్లాస్టిక్ నోట్లను తెచ్చేందుకు ప్రయత్నాలు జరగ్గా.. ఆ ప్రయత్నాలు కొన్ని అనివార్య కారణాలతో నిలిచిపోయాయి. అయితే ఇప్పుడు మళ్లీ ఆ ప్రతిపాదన తెరపైకి రావడంతో.. భారతదేశంలో త్వరలోనే ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు చలామణిలోకి రావచ్చని అంటున్నారు. ఈ క్రమంలో కీలక అప్డేట్ ఒకటి బయటకొచ్చింది. ముందుగా రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్లను తీసుకురానున్నారని, ఆ తర్వాత దశలవారీగా మిగతా నోట్లను తీసుకొస్తారని వార్తలు వస్తున్నాయి. 2027 నుండి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నోట్లను చలామణిలోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.
పాలిమర్ షీట్ల కోసం ఆర్డర్
కొత్త నోట్ల ముద్రణకు అవసరమైన ప్రత్యేక పాలిమర్ షీట్లను సరఫరా చేసేందుకు అంతర్జాతీయ కంపెనీలను ఆహ్వానించే ప్రక్రియను ఆర్బీఐ ప్రారంభించింది. భారతదేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఇది మొదటి ప్రధాన అడుగుగా చెబుతున్నారు. ఆర్బీఐ కరెన్సీ ముద్రణ విభాగమైన భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ (బిఆర్బిఎన్ఎంపిఎల్), బైయాక్సియల్లీ ఓరియంటెడ్ పాలిప్రొపైలిన్ (బిఓపిపి) ఆధారిత పాలిమర్ సబ్స్ట్రేట్ షీట్ల సరఫరా కోసం గ్లోబల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇయోఐ (ఇఓఐ)ని జారీ చేసింది. ఈ షీట్లను పైలట్ బ్యాచ్ నోట్ల ముద్రణ కోసం ఉపయోగిస్తారు. పాలిమర్ నోట్లు అధునాతన భద్రతా ఫీచర్లతో రానున్నాయని చెబుతున్నారు. లోహపు అంకెలు, అయస్కాంత సూడో థ్రెడ్, నీడ చిత్రాలు, ఇంద్రధనుస్సు రంగుల నమూనాలు ఉంటాయి. ప్లాస్టిక్ కరెన్సీ నోట్ల తయారీ కోసం సుమారు 68,000 రీముల పాలిమర్ షీట్లను కోరగా.. వాటిలో సగభాగాన్ని ఒక్కో డినామినేషన్కు కేటాయించారు.
2027లో ప్లాస్టిక్ నోట్లు వస్తాయా..?
కొనుగోలు ప్రక్రియలో కఠినమైన భద్రతా నిబంధనలు పాటించనున్నారు. సరఫరాదారులకు కేంద్ర బ్యాంకులకు లేదా నోట్ల ముద్రణ సంస్థలకు భద్రతా లక్షణాలతో కూడిన పాలిమర్ సబ్స్ట్రేట్లను అందించడంలో కనీసం మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి. వారు ప్రయోగశాల పరీక్ష కోసం నమూనాలను కూడా సమర్పించాలి. ఆ పదార్థంలో జంతు కొవ్వు మరియు DNA కంటెంట్ లేదని ధృవీకరించాలి. ఆర్బీఐ చర్యలు చూస్తుంటే వచ్చే ఏడాదిలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రారంభించవచ్చని తెలుస్తోంది.
