తాజావార్తలు

ఉమ్మడి పౌర స్మృతి బిల్లుకు ఆమోదం తెలిపిన ఎంపీ అసెంబ్లీ.. దేశంలోనే 4వ రాష్ట్రంగా రికార్డు!

ఉమ్మడి పౌర స్మృతి బిల్లుకు ఆమోదం తెలిపిన ఎంపీ అసెంబ్లీ.. దేశంలోనే 4వ రాష్ట్రంగా రికార్డు!


మధ్యప్రదేశ్ శాసనసభ ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code) బిల్లుకు ఆమోదం తెలిపింది. గోవా, అస్సాం, ఉత్తరాఖండ్ తర్వాత ఈ చట్టాన్ని తీసుకొచ్చిన నాలుగో రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. అయితే, రాష్ట్రంలోని గిరిజన సామాజిక వర్గాల సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షిస్తూ వారికి ఈ చట్టం నుంచి మినహాయింపు ఇచ్చారు.

బిల్లు ద్వారా వివాహం, విడాకులు, వారసత్వం, సహజీవనం (Live-in Relationship) వంటి అంశాల్లో కీలక మార్పులు రానున్నాయి. రాష్ట్రంలో బహుభార్యత్వాన్ని పూర్తిగా నిషేధించారు. అలాగే త్రిపుల్ తలాక్ ఆచారాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తారు. నెల రోజులకు మించి సహజీవనంలో ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. భాగస్వామికి నిజాలు దాచి లేదా మోసం చేస్తూ సహజీవనం చేస్తే ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించే నిబంధన చేర్చారు. తల్లిదండ్రుల ఆస్తిలో లింగభేదం లేకుండా పిల్లలందరికీ (కుమారులు, కుమార్తెలు) సమాన వారసత్వ హక్కులు లభిస్తాయి.

ఈ బిల్లు రూపకల్పనలో భాగస్వామ్యానికి సంబంధించి 9.58 లక్షల సూచనలు వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా 80 శాతం మంది ముస్లిం మహిళలు, 40 శాతం మంది ముస్లిం పురుషులు ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చారని అసెంబ్లీలో వివరించింది. ఈ బిల్లు ప్రవేశపెట్టిన సమయం నుంచి సభలో తీవ్ర రగడ జరిగింది. ఈ బిల్లు పౌరుల రాజ్యాంగ హక్కులను, మత స్వాతంత్య్రాన్ని ఉల్లంఘిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఆరోపణలపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్రంగా స్పందించారు.

సమాజంలో మహిళల సాధికారత, అందరికీ సమానత్వం తేవడమే తమ లక్యమని స్పష్టం చేస్తూ, కాంగ్రెస్ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తోందని విమర్శించారు. నిరసనల మధ్యే సభ ఈ బిల్లును ఆమోదించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *