తాజావార్తలు

ట్రాన్స్‌జెండర్లకు సర్కార్ గుడ్‌న్యూస్.. మున్సిపల్ కార్పొరేషన్లలో కో-ఆప్షన్ సభ్యులుగా నియామకం


హైదరాబాద్: రాష్ట్రంలోని ట్రాన్స్‌జెండర్లకు తెలంగాణ ప్రభుత్వం కీలక అవకాశం కల్పించనుంది. రాష్ట్రంలో క్యూర్ పరిధికి వెలుపల ఉన్న 9 మున్సిపల్ కార్పొరేషన్లలో కో-ఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్‌జెండర్లను నియమించనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు శాసనసభలో వెల్లడించారు. స్థానిక సంస్థల్లో అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా ట్రాన్స్‌జెండర్‌ సమాజానికి కూడా మున్సిపల్ పాలనలో భాగస్వామ్యం కల్పించేందుకు కో-ఆప్షన్ సభ్యులుగా అవకాశం ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.

దీంతో ఇప్పటివరకు స్థానిక సంస్థల పాలనలో పరిమితంగా ఉన్న ట్రాన్స్‌జెండర్ల ప్రాతినిధ్యం మరింత పెరిగే అవకాశం ఉంది. మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రజా సమస్యలు, సంక్షేమం, మౌలిక వసతులు, సామాజిక అంశాలపై తమ వాణిని వినిపించే అవకాశం వారికి లభించనుంది. ప్రభుత్వ నిర్ణయంపై ట్రాన్స్‌జెండర్‌ సమాజంలో హర్షం వ్యక్తమవుతోంది. తమ వర్గానికి స్థానిక పాలనలో ప్రాతినిధ్యం లభించడం ద్వారా తమ సమస్యలను నేరుగా పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లేందుకు అవకాశం ఏర్పడుతుందని భావిస్తున్నారు.

కో-ఆప్షన్ సభ్యుల నియామక ప్రక్రియ, అర్హతలు, ఎంపిక విధానం వంటి అంశాలపై ప్రభుత్వం తదుపరి స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అయితే మంత్రి శ్రీ‌ధర్‌బాబు ప్రకటనతో రాష్ట్రంలోని ట్రాన్స్‌జెండర్లకు స్థానిక పాలనలో కొత్త అవకాశాలకు మార్గం సుగమమైనట్లైంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *