‘ధురందర్ ‘ చిత్రంలోని ‘షరారత్’ పాటతో మంచి పేరు సంపాదించుకున్న నటి అయేషా ఖాన్ను బుధవారం (జూలై 22) ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు . ముంబైలో జరుగుతున్న విద్యార్థుల నిరసనకు మద్దతు తెలిపేందుకు స్నేహితులతో కలిసి వచ్చిన ఆ నటిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు . ఈ సందర్భంగా ఎలాంటి ముందస్తు హెచ్చరిక , కారణం లేకుండా పోలీసులు తనను ఈడ్చుకెళ్లారంటూ ఓ వీడియోను అయేషా ఖాన్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. దాదర్లో జరగనున్న విద్యార్థుల నిరసనకు మద్దతు తెలిపేందుకు తాను సాయంత్రం 4 గంటలకు వెళ్లినట్లు అయేషా ఖాన్ తెలిపింది. “మేము అక్కడికి చేరుకునే వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఎలాంటి నినాదాలు చేయలేదు. సరిగ్గా అప్పుడే ఒక పోలీసు అధికారి వచ్చి, మీరు ఇక్కడ నిరసన తెలపడానికి వీల్లేదని అన్నారు. నేను వేరే మార్గం ఏముందని ఆయనను అడిగాను. కానీ ఎలాంటి కారణం లేకుండా పోలీసులు నా సోదరుడిని, స్నేహితుడిని ఈడ్చుకెళ్లారు. ఆ తర్వాత సుమారు 15 మంది పోలీసులు మమ్మల్ని బలవంతంగా ఒక వ్యాన్లో ఎక్కించారు’ అని అయేషా ఖాన్ చెప్పుకొచ్చింది.
“నలుగురు ఐదుగురు మహిళా పోలీసులు నన్ను లాక్కెళ్లారు. మమ్మల్ని అంతసేపు వ్యాన్లో ఎందుకు ఉంచారు? మేమేం తప్పు చేశామని అడిగాము, కానీ మాకు సమాధానం రాలేదు. వాళ్లు మమ్మల్ని దాదర్ నుంచి వర్లీకి తీసుకొచ్చారు. శాంతియుతంగా రోడ్డుపై నిలబడినందుకు మమ్మల్ని ఈడ్చుకెళ్లి నిర్బంధించారు. మేము ఏ చట్టాన్ని ఉల్లంఘించామని అడిగాం. కానీ పోలీసుల నుంచ సమాధానం రాలేదు. రోడ్డుపై నిలబడటం ఎప్పటినుంచి నేరమైంది? ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించకపోగా, పౌరులు వేధింపులకు గురవుతున్నారు. అయినప్పటికీ, నాకు మంచి భవిష్యత్తుపై ఆశ ఉంది’ అని ఆయేషా ఖాన్ ఆవేదన వ్యక్తం చేసింది.
ఇవి కూడా చదవండి
అయేషా ఖాన్ ను అదుపులోకి తీసుకుంటోన్న పోలీసులు..
న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రారంభమైన విద్యార్థుల ఆందోళనలు ఇప్పుడు దేశంలోని వివిధ నగరాలకు వ్యాపించాయి, ముంబైలో నిరసనలు మూడవ రోజుకు చేరుకున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పలుచోట్ల నిరసనలు జరుగుతుండగా, పోలీసులు పలువురు నిరసనకారులను అదుపులోకి తీసుకుంటున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
