జులై నెల వచ్చేయడంలో దేశంలో అనేక కొత్త మార్పులు అమల్లోకి వచ్చాయి. ప్రజలను నేరుగా ప్రభావితం చేసే కొత్త నిర్ణయాలు జులై 1 నుంచి ప్రవేశపెట్టారు. నెల ప్రారంభంలోనే దేశ ప్రజలకు పెద్ద ఊరట కలిగింది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. ఇక బంగారం ధరలు కూడా తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. ఇక జెట్ ఫ్యూయల్ ధరలు కూడా తగ్గగా.. దీని వల్ల విమాన ఛార్జీలు తగ్గే అవకాశముంది. ఇలా ఒకేరోజు దేశ ప్రజలకు నాలుగు శుభవార్తలు అందాయి. వీటి ద్వారా దేశ ప్రజలందరికీ ప్రయోజనం చేకూరనుంది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
తగ్గిన కమర్షియల్ గ్యాస్ ధరలు
హోటళ్లు, రెస్టారెంట్లలో ఉపయోగించే 19 కిలోల ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ ధరను బుధవారం రూ.183.50 తగ్గించారు. దీంతో ఇప్పుడు సిలిండర్ ధర రూ.2,930కి చేరుకుంది. గత నెలలో వాణిజ్య సిలిండర్ ధర రూ.3,113కి చేరుకుంది. ఇప్పుడు ధరలు తగ్గాయి. ఇక 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.942 వద్ద స్థిరంగా ఉంది. దీని ధరను చివరిసారిగా జూన్ 7న రూ.29 పెంచారు. త్వరలో ఈ ధర కూడా తగ్గే అవకాశముంది.
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు
దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ అయిన నయారా ఎనర్జీ ఇంధన ధరలను తగ్గించింది. పెట్రోల్ ధరను లీటరుకు రూ.5, డీజిల్ ధరను లీటరుకు రూ.3 తగ్గించింది. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు తగ్గడం, హర్ముజ్ జలసంధి తెరుచుకోవడంతో ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి. అంతేకాకుండా ముడి చమురు సరఫరా మెరుగుపడింది. దేశవ్యాప్తంగా 7,000కు పైగా నైరా పెట్రోల్ పంపులలో సవరించిన ధరలు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి.
తగ్గనున్న విమాన ఛార్జీలు
ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు తగ్గుతున్న నేపథ్యంలో బుధవారం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరను లీటరుకు రూ. 5 తగ్గించారు. పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు రికార్డు స్థాయికి చేరిన తర్వాత ధర తగ్గించడం ఇదే మొదటిసారి. గత నెలలో ప్రభుత్వం ‘ATF ధరల స్థిరీకరణ పథకం’ను ప్రారంభించింది. ఇందులోపాల్గొనే విమానయాన సంస్థలు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ను లీటరుకు రూ.115కే కొనుగోలు చేయవచ్చు.
తగ్గిన బంగారం ధరలు
ఇక బంగారం ధరలు బుధవార భారీగా పడిపోయాయి. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,40,780కి చేరుకోగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,29,050కి పడిపోయింది. పెళ్లిళ్ల సీజన్ క్రమంలో గోల్డ్ కొనుగోలుచేసేవారికి ఇది మంచి శుభవార్తగా చెప్పవచ్చు.
