దేశంలో తొలి బుల్లె్ట్ రైలు ఎప్పుడు వస్తుందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ బుల్లెట్ రైల్ కారిడార్లో దేశంలో మొట్టమొదటి బుల్లెట్ రైలును ప్రవేశపెట్టేందుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఈ కారిడార్లోని సూరప్-వాపి మధ్య తొలి బుల్లెట్ రైలు పరుగులు తీయనుంది. వచ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న ఈ రైలును ప్రారంభించాలని ఇప్పటికే కేంద్రం ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది.
వచ్చే ఏడాదిలో ట్రయల్స్ ప్రారంభం కానుండగా.. ఆ తర్వాత రైలును ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే రైళ్ల తయారీ కూడా ప్రారంభమైంది. సూరత్-వాపి మధ్య 97 కిలోమీటర్ల మార్గంలో తొలి రైలు ప్రారంభించనున్నారు. స్వదేశీ టెక్నాలజీతో జపాన్తో కలిసి ఈ రైలును అభివృద్ది చేస్తున్నారు. గత నెలలో బుల్లెట్ రైలు తయారీ ప్రారంభమైంది.
ఇప్పటికే సూరప్-వాపి మార్గంలో సివిల్ పనులు దాదాపుగా పూర్తి అయ్యాయి. ఇక సిగ్నలింగ్ పనులు కూడా దాదాపుగా పూర్తి కావొచ్చాయి. మిగతా పనులను కూడా త్వరలో పూర్తి చేయనున్నారు. అయితే హైస్పీడ్ బుల్లెట్ రైల్ కారిడార్ నిర్మాణానికి కిలోమీటర్కు ఎంత ఖర్చు అవుతుందనే వివరాలు బయటకొచ్చాయి.
ముంబై-అహ్మదాబాద్ కారిడార్కు ప్రతీ కిలోమీటర్కు రూ.390 కోట్లు ఖర్చు అవుతుందట. ఓ సీనియర్ అధికారి ఈ విషయాన్ని వెల్లడించాడు. బుల్లెట్ రైళ్లకు అయ్యే ఖర్చు విషయంలో ఇతర దేశాల కంటే భారత్కు తక్కువ ఖర్చు అవుతుంది. మేకిన్ ఇండియాలో భాగంగా స్వదేశీ సాంకేతికను ఉపయోగించడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు.
జపాన్కు చెందిన హోకురికు షింకన్సెన్కు కిలోమీటరుకు రూ.1,150 కోట్లకుపైగా ఖర్చవుతుండగా.. ఇండోనేషియాకు చెందిన వూషి కిలోమీటరుకు సుమారు రూ.486 కోట్లు ఖర్చు చేస్తోంది. ప్రపంచ ప్రమాణాలతో పోలిస్తే భారతదేశ ప్రాజెక్ట్ గణనీయంగా చౌకైనదని చెప్పవచ్చు. అభివృద్ది చెందిన ఇతర దేశాల కంటే భారత్ తక్కువగా ఖర్చు చేస్తోంది.





