తిరుపతి జిల్లా అనంతరాజుపేటలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. హుబ్లీ నుంచి తిరుపతికి వెళ్తున్న ప్యాసింజర్ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. రైల్వే కోడూరు మండలం అనంతరాజుపేట సమీపంలో ప్రయాణిస్తున్న ఓ ప్యాసింజర్ రైలు ఇంజన్ నుండి మూడవ బోగీ పైభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమై రైలు వేగాన్ని తగ్గించారు. అనంతరం రైల్వే కోడూరు స్టేషన్లో రైలును నిలిపివేసి క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
సిబ్బంది బోగీ పైభాగాన్ని పరిశీలించగా, అక్కడ ఒక పురుషుడి మృతదేహం కాలిపోయిన స్థితిలో కనిపించింది. అది చూసి సిబ్బంది ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే రైలు మీదున్న హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగలడం వల్లే ఆ వ్యక్తి విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మరణించి ఉంటాడని, ఈ కారణంగా మంటలు చెలరేగి ఉంటాయని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఆ తర్వాత రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు ఎవరు?, ఆ వ్యక్తి రైలు బోగీ పైకి ఎందుకు ఎక్కాడు? అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో మంటలు రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే, సిబ్బంది సమయస్ఫూర్తితో రైలును ఆపడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.ఈ ఘటనతో రైల్వే కోడూరు స్టేషన్లో కొంతసేపు ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
