శ్మశానాన్ని అడ్డాగా చేసుకుని గంజాయి తరలిస్తున్న ముగ్గురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను గోపాలపట్నం పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గోపాలపట్నం పరిసర ప్రాంతాల్లోని స్మశాన వాటిక వద్ద ముగ్గురు వ్యక్తులు ఎవరికీ అనుమానం రాకుండా తిరుగుతున్నారు. అయితే, అదే సమయంలో అక్కడ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసుల నిఘా వీరిపై పడింది. స్థానికులు కాని ఆ ముగ్గురి బాడీ లాంగ్వేజ్, ప్రవర్తన తేడాగా అనిపించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు.
అయితే పోలీసుల విచారణలో తాము టూరిస్టులమంటూ ఆ ముగ్గురు కబుర్లు చెప్పారు. వారు తెలుగు వాళ్ళు కాకపోవడం, పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చిన పోలీసులు వారిని వెంటనే అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీస్ స్టేషన్లో వారి బ్యాగులను తనిఖీ చేయగా, వాటి నుంచి ఘాటైన వాసన వచ్చింది. బ్యాగులు పూర్తిగా ఓపెన్ చేసి చూడగా పెద్ద ఎత్తున గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. దీంతో ముగ్గురిపై కేసు నమోద చేసి అరెస్ట్ చేశారు పోలీసులు.
పట్టుబడిన వారిలో కర్ణాటకకు చెందిన గోవర్ధన్, రూపేష్లతో పాటు కేరళకు చెందిన సజిత్ చంద్రన్ ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వీరంతా అరకు, ఏజెన్సీ పరిసర ప్రాంతాల్లో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి.. తమ సొంత రాష్ట్రాలైన కర్ణాటక, కేరళల్లో దీనిని అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకోవాలని ప్లాన్ చేసినట్టు గుర్తించారు.
నిందితుల నుంచి 10.5 కిలోల గంజాయిని గోపాలపట్నం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఏజెన్సీ ప్రాంతాల నుంచి నగరంలోకి గంజాయి రవాణా చేసే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని పోలీసులు హెచ్చరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
