
ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు చిన్నారులను హత్య చేసి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మృతులను హరీష్ (39), ఆయన భార్య నిశ్చిత (37), కుమార్తెలు రక్ష (8), నక్ష (4)గా పోలీసులు గుర్తించారు. మృతుడు హరీష్ ఓ బీమా సంస్థలో వాహనాల రికవరీ విభాగంలో పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రాథమిక విచారణలో హరీష్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పోలీసులు గుర్తించారు. అప్పుల ఒత్తిడితోనే ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే కుటుంబ సమస్యలు లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. మైసూరు ఎస్పీ మల్లికార్జున్ బాల్దండి తెలిపిన వివరాల ప్రకారం..
భార్య, కుమార్తెల మృతదేహాలు బెడ్రూంలో..
ఇంటి గ్రౌండ్ ఫ్లోర్లోని ఓ బెడ్రూంలో భార్య, ఇద్దరు కుమార్తెల మృతదేహాలు మంచంపై కనిపించాయి. వారి ముఖాలకు అంటుకునే టేప్ (అడ్హేసివ్ టేప్) చుట్టి ఉంది. అనంతరం ఇంటి పై అంతస్తులో హరీష్ ఉరివేసుకుని మృతి చెందిన స్థితిలో కనిపించాడు. ఘటన స్థలంలో పోలీసులు ఓ సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. అందులో తాను పై అంతస్తు గదిలో ఉరివేసుకుని ఉంటానని హరీష్ పేర్కొన్నాడు. అలాగే లాకర్లో ఉన్న పత్రాలు, ఆస్తులకు సంబంధించిన వివరాలు, అప్పుల వివరాలు, వాటిని ఎవరికి అప్పగించాలనే సూచనలను కూడా నోట్లో రాసినట్లు పోలీసులు వెల్లడించారు. ‘అన్ని పత్రాలు లాకర్లో ఉన్నాయి. తాళం ఎప్పటిలాగే ఉన్న చోటే ఉంది. ఆస్తి పత్రాలపై ఉన్న సూచనల ప్రకారం చర్యలు తీసుకోవాలి. వాటిపై పేర్కొన్న వ్యక్తికి బాక్స్ను అందజేయండి’ అని సూసైడ్ నోట్లో హరీష్ రాసినట్లు తెలిపారు.
మూడు రోజుల ముందే ప్లాన్..
ప్రాథమిక విచారణలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనకు మూడు రోజుల ముందు హరీష్ తన తల్లిని అమ్మమ్మ ఇంటికి పంపించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ ఘటనను ముందే ప్రణాళికాబద్ధంగా అమలు చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హున్సూరు టౌన్ పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్పుల ఒత్తిడి, కుటుంబ పరిస్థితులు లేదా ఇతర వ్యక్తిగత కారణాల వల్ల ఈ విషాదం జరిగిందా? అనే అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
