భారతదేశ సముద్ర శక్తి సమతుల్య నౌకాదళంపైనే ఆధారపడి ఉందనే సత్యాన్ని నిరూపిస్తూ, భారత నౌకాదళం తన సామర్థ్యాలను శరవేగంగా విస్తరిస్తోంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ప్రధాన భద్రతా ప్రదాతగా ఉన్న భారత్, దేశ జాతీయ ప్రయోజనాలకు రక్షణ కల్పించడంలో సరికొత్త మైలురాళ్లను అందుకుంటోంది. ఇందులో భాగంగా ఇటీవల ప్రవేశపెట్టిన ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సన్హోదక్ , ఐఎన్ఎస్ అగ్రయ, ఐఎన్ఎస్ మహేంద్రగిరి యుద్ధనౌకలు భారత సముద్ర రక్షణ కవచాన్ని మరింత పటిష్టం చేస్తున్నాయి.
సుమారు 11,098 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం, 24 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రత్యేక ఆర్థిక మండలి , దేశ మొత్తం వాణిజ్యంలో 90 శాతం వరకు జరిగే సముద్ర వాణిజ్య మార్గాలకు రక్షణ కల్పించడంలో ఈ స్వదేశీ నౌకలు కీలక పాత్ర పోషించనున్నాయి. కేవలం ఒక నెల వ్యవధిలోనే నాలుగు నూతన తరం నౌకాదళ ప్లాట్ఫారమ్లను ప్రవేశపెట్టడం భారతదేశ బహుళ-పొరల భద్రతా వ్యూహానికి నిదర్శనం.
భారత నౌకాదళాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇండియన్ నేవీ మూడు వేర్వేరు శ్రేణుల యుద్ధనౌకలను ఉపయోగిస్తుంది. ఇందులో ఒకటి నీలగిరి తరగతి, మరోటి సంధాయక్-తరగతి, ఇంకోటి అర్నాల-తరగతి జలాంతర్గాములు ఈ మూడు మన ఇండియన్ నేవీకి కీలక స్తంభాలుగా నిలుస్తున్నాయి. ఇవి ఎలా పనిచేస్తాయో ఇప్పుడు చూద్దాం.
నీలగిరి-తరగతి (Project 17A): శుత్రువల నుంచి ఎదరుయ్యే తీవ్రమైన పోరాట పరిస్థితులను ఎదుర్కొనేందుకు అత్యంత ఆధునిక సాంకేతికతతో ఈ స్టెల్త్ ఫ్రిగేట్లను నిర్మించారు. శత్రువుల రాడార్, ఉష్ణ, ధ్వని వ్యవస్థల కంటికి చిక్కకుండా తప్పించుకునే సామర్థ్యం ఈ ప్రాజెక్ట్ 17A స్పెషాలిటీ. అంతేకాదు పోరాట సమయంలో ఇది అత్యంత సురక్షితంగా, సమర్థవంతంగా శత్రువులపై దాడి చేయగలవు.
సంధాయక్-తరగతి సర్వే నౌకలు: సముద్రంపై పూర్తి పట్టు సాధించాలంటే సముద్ర గర్భంపై లోతైన అవగాహన ఎంతో అవసరం. దీని కోసమే ఈ సంధాయక్-తరగతి సర్వే నౌకలను మన నేవీ ఉపయోగిస్తుంది. ఇవి సముద్రగర్భాన్ని పూర్తిగా మ్యాప్ చేసి.. సముద్ర శాస్త్ర సంబంధిత సమాచారాన్ని సేకరిస్తాయి. అలా సురక్షితమైన నావిగేషన్ కోసం కచ్చితమైన చార్టులను తయారు చేస్తూ సముద్ర వాణిజ్యానికి ఎంతగానో సహాయపడుతున్నాయి.
అర్నాల-తరగతి జలాంతర్గామి: తీరప్రాంతాలకు సమీపంలో శత్రువుల ముప్పును తిప్పికొట్టడానికి ఈ నిస్సార జలాంతర్గామి వ్యతిరేక నౌకలను రూపొందించారు. ఇవి తీరప్రాంత జలాల్లో దాగి ఉండే శత్రు జలాంతర్గాములను గుర్తించి, వాటిని నిర్వీర్యం చేయడంలో ఉపయోగపడుతాయి. దీని కారణంగా దేశ తీరప్రాంత రక్షణలో ఇది ఎంతో కీలకంగా మారుతుంది.
విపత్తు సమయాల్లోనూ అగ్రగామి
ఈ యుద్ధనౌకలు కేవలం యుద్ధ సమయాలయాల్లో ఉపయోగించడం కోసం మాత్రమే పరిమితం కాలేదు. శాంతి సమయాల్లోనూ కీలక సేవలందించేలా రూపొందించబడ్డాయి. మానవతా సహాయం, విపత్తు సహాయక చర్యలు, సముద్రంలో శోధన-రక్షణ కార్యక్రమాలను ఇవి విజయవంతంగా నిర్వహించగలవు.
ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తి:
ఈ సరికొత్త యుద్ధనౌకలు పూర్తిగా స్వదేశీ టెక్నాలజీ తయారు చేయబడినవి. భారత్ సొంతంగా ఆధునిక యుద్ధనౌకలను తాయరు చేయడమే కాకుండా, ఉత్పత్తి చేయగల భారతదేశపు ఎదుగుదలకు ఈ ప్రాజెక్టులు నిలువెత్తు సాక్ష్యాలు. ఇవి దేశ రక్షణ ఉత్పాదక రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా, హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారతదేశాన్ని ఒక తిరుగులేని అగ్రగామి సముద్ర శక్తిగా నిలబెడుతున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
