నేటి సమాజంలో మోసాలు, కుట్రలు, అన్యాయాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. చాలామంది అమాయకులు దుర్మార్గుల మాటలను నమ్మి ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిసార్లు ప్రాణాపాయ పరిస్థితులను కూడా ఎదుర్కొంటున్నారు. అలాంటి సందర్భాల్లో ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన గొప్ప జీవిత సత్యాన్ని ‘గొర్రెపిల్ల – నక్క’ నీతి కథ ఎంతో అద్భుతంగా వివరిస్తుంది. ఎదుటివారు దుష్టులని తెలిసినప్పుడు వారితో వాదనలకు దిగకుండా దూరంగా ఉండటమే మనకు శ్రీరామరక్ష అని నిరూపించే ఒక చక్కని కథ ఇది.
కథ
ఒక రోజు ఒక గొర్రె పిల్లకు బాగా దాహం వేసింది. దాహం తీర్చుకోవడానికి అడవిలోని ఒక కాలువ వద్దకు వెళ్లింది. అదే కాలువ వద్ద జిత్తులమారిన నక్క కూడా నీళ్లు తాగుతోంది. ఒంటరిగా ఉన్న గొర్రె పిల్లను చూసిన నక్క మనసులో దాన్ని చంపి తినాలనే దురాలోచన కలిగింది. దీని కోసం ఆ నక్క ఒక కుట్ర పన్నింది.
వెంటనే “ఏయ్ ఆగు..నేను తాగే నీళ్లను పాడుచేస్తున్నావు” అంటూ గొర్రె పిల్లపై ఆ నక్క అరిచింది. అమాయకమైన గొర్రెపిల్ల మాత్రం భయంతో వణికిపోతూ..”నీళ్లు నీ వైపు నుంచి నా వైపుకు వస్తున్నాయి. నేను ఎలా నీళ్లను పాడుచేస్తాను?” అని తార్కికంగా సమాధానం చెప్పింది.
ఇవి కూడా చదవండి
నక్కకు నిజం తెలిసినా.. గొర్రె పిల్ల సమాధానాన్ని అంగీకరించే ఉద్దేశం దానికి లేదు. వెంటనే మరో అబద్ధం చెబుతూ.. “గత ఏడాది నాతో గొడవ పెట్టుకున్నది నువ్వే కదా” అని ఆరోపించింది.
దానికి గొర్రెపిల్ల.. “అప్పుడు అసలు నేను పుట్టనేలేదు” అని చెప్పింది. అయినా నక్క వెనక్కి తగ్గలేదు. “అయితే నీ అమ్మ నాతో గొడవ పెట్టుకుంది. ఆమె కడుపులో నువ్వే ఉన్నావు కాబట్టి శిక్ష నీకే పడాలి” అంటూ వంకర తర్కం చేసి చివరకు గొర్రెపిల్లపై దాడి చేసింది. పాపం… అమాయకమైన గొర్రెపిల్లకు తప్పించుకునే అవకాశం కూడా లేకపోయింది.
నీతి
ఈ కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. దుష్టులు, మూర్ఖులు లేదా చెడు ఉద్దేశాలతో ఉన్న వ్యక్తులు నిజాన్ని తెలుసుకోవడానికి కాదు, తమ వాదనను గెలిపించుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తారు. అలాంటి వారితో ఎంత తర్కించినా, ఎంత నిజం చెప్పినా వారు అంగీకరించరు.
అందుకే వారితో అనవసర వాదనలు, గొడవలు కంటే అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండటమే ఉత్తమమైన మార్గం. మన శాంతి, భద్రత, గౌరవం కాపాడుకోవాలంటే ప్రతి సందర్భంలో ఎవరితో మాట్లాడాలి, ఎవరి నుంచి దూరంగా ఉండాలనే వివేకం చాలా అవసరం.
దుష్టులతో వాదించడం వల్ల సత్యం గెలవదు. మన సమయం, మనశ్శాంతి మాత్రమే వృథా అవుతాయి. అలాంటి వారితో దూరంగా ఉండటమే నిజమైన తెలివి అనిపించుకుంటుంది. అదే మన జీవితానికి శ్రీరామరక్ష.
Also Read: అత్యాశతో చివరికి వినాశనమే.. బంగారు జింక కథ చెప్పే జీవిత సత్యం ఇదే!
