ఏపీలోని రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. అన్నదాత సుఖీభవ డబ్బుల విడుదలపై ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఈ నెల 20వ తేదీన ఈ పథకం డబ్బులను లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది. 2026-27వ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి రూ.4 వేలను రైతుల ఖాతాల్లో వేయనుంది. ఏపీ సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో జరిగే కార్యక్రమంలో నిధులను రిలీజ్ చేయనున్నారు. పీఎం కిసాన్ పథకంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్ అమలు చేస్తోంది. పీఎం కిసాన్ సాయం రూ.2 వేలతో పాటు అదనంగా రూ.5 వేలు ప్రభుత్వం జమ చేయనుంది. దీంతో మొత్తం రూ.7 వేలు రైతుల ఖాతాల్లో పడనుంది.
పీఎం కిసాన్ నిధులు విడుదల
ప్రధాని మోదీ పశ్చిమబెంగాల్లోని తారకేశ్వర్లో పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్నారు. ఈ మేరకు పీఎంఓ కార్యాలయం ప్రకటన జారీ చేసింది. పీఎం కిసాన్ కింద రూ.2 వేలు లబ్దిదారుల ఖాతాల్లో పడనుంది. అదే సమయానికి చంద్రబాబు అన్నదాత సుఖీభవ నిధులను రిలీజ్ చేయనున్నారు. రాష్ట్రంలో 46,84,838 మంది రైతుల ఖాతాల్లో రూ.3,125 కోట్లు జమ కానున్నాయి. వీటిల్లో రాష్ట్ర వాటా రూ.2,342 కోట్లు, కేంద్ర వాటా రూ.782 కోట్లు ఉంది. ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ.14 వేలు అందిస్తోంది. ఇక పీఎం కిసాన్ సాయం రూ.6 వేలు ప్రతీ ఏడాది అందుతుంది. దీంతో మొత్తం ఏడాదికి రూ.20 వేలు రైతులకు అందుతుంది. తొలి విడతలో రూ.7 వేలు, రెండో విడతలో రూ.7 వేలు, మూడో విడతలో రూ.6 వేలు జమ అవుతున్నాయి.
లక్షల మందికి లబ్ది
ఏపీలో 46 లక్షల 85 వేల 838 మంది రైతుల ఖాతాల్లో నిధులు పడనుండగా.. వీరిల్లో పట్టాదారు రైతులు 45 లక్షల 69 వేల 817 మంది ఉండగా.. అటవీ భూసాగు హక్కుదారులు 1,16,021 మంది ఉన్నారు. అయితే పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ డబ్బులు పడాలంటే రైతులు ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి. ప్రతీ ఆర్ధిక సంవత్సరంలో ఒకసారి ఈ ప్రాసెస్ పూర్తి చేశారు. లబ్దిదారుల ధృవీకరణ కోసం ప్రభుత్వం కేవైసీని ప్రవేశపెట్టింది. పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ ద్వారా యాప్ ద్వారా కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. రైతు సేవా కేంద్రాలు, కామన్ సర్వీసెస్ సెంటర్ ద్వారా కూడా ఈ ప్రాసెస్ పూర్తి చేయవచ్చు. ఇక ఫార్మర్ రిజిస్ట్రీలో కూడా తప్పనిసరిగా నమోదై ఉండాలి.
