హైదరాబాద్, జూన్ 1: దేశ వ్యాప్తంగా ఉన్న 23 ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలు ఈ రోజు (జూన్ 1న) ఉదయం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఐఐటీ రూర్కీ ర్యాంకులను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. మే 17న జరిగిన ఈ పరీక్షలో రెండు పేపర్లకు కలిపి దేశ వ్యాప్తంగా మొత్తం 1,79,694 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో దాదాపు 56,880 మంది అర్హత సాధించారు. వీరిలో 10,107 మంది అమ్మాయిలు ఉన్నారు. తాజా ఫలితాల్లో ఐఐటీ ఢిల్లీ జోన్కు చెందిన శుభమ్ కుమార్ 360 మార్కులకు గాను 330 మార్కులు సాధించి దేశంలోనే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించాడు.
ఇక ఐఐటీ ఢిల్లీ జోన్కే చెందిన ఆరోహి దేశ్పాండే 280 మార్కులతో ఆల్ ఇండియా 77వ ర్యాంక్ సాధించి మహిళల విభాగంలో దేశంలోనే టాప్ ర్యాంకర్గా నిలిచింది. సోమవారం విడుదలైన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా జాతీయ స్థాయిలో అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఐఐటీ మద్రాస్ (IIT Madras) జోన్ పరిధిలోకి వస్తాయి. అన్ని జోన్లతో పోల్చితే ఐఐటీ మద్రాస్ జోన్ నుంచే అత్యధికంగా 14,294 మంది విద్యార్థులు క్వాలిఫై అవడం విశేషం. జాతీయ స్థాయిలో టాప్ 10 ర్యాంకుల్లో ఐఐటీ మద్రాస్ జోన్ నుంచి ముగ్గురు విద్యార్థులు చోటు దక్కించుకున్నారు.
ఇవి కూడా చదవండి
జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాల్లో టాప్ ర్యాంకులు సాధించిన తెలుగు విద్యార్ధులు వీరే
- మోహిత్ శేఖర్ శుక్లా 319 మార్కులతో ఆల్ ఇండియా 4వ ర్యాంక్ (ఐఐటీ మద్రాస్ జోన్ టాపర్) సాధించాడు.
- కూచి సందీప్ 318 మార్కులతో ఆల్ ఇండియా 5వ ర్యాంక్ (ఐఐటీ మద్రాస్ జోన్ టాపర్)
- మెడిశెట్టి నాగ సహర్ష 312 మార్కులతో ఆల్ ఇండియా 9వ ర్యాంక్ (ఐఐటీ మద్రాస్ జోన్ టాపర్)
- దర్శ్ సిక్కా జాతీయ స్థాయిలో 312 మార్కులతో 10వ ర్యాంక్ (ఐఐటీ ఢిల్లీ జోన్కు చెందిన తెలుగు విద్యార్థి)
- వెల్దుర్తి హర్షిత్ ఆల్ ఇండియా 15వ ర్యాంక్ (ఐఐటీ మద్రాస్ జోన్ టాపర్)
- ఆరవ్ గుప్తా ఆల్ ఇండియా 17వ ర్యాంక్ (ఐఐటీ మద్రాస్ జోన్ టాపర్)
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
