తాజావార్తలు

భారత్ – ఒమన్ మధ్య FTA.. జూన్‌ 1 నుంచి అమల్లోకి! ప్రయోజనాలు ఏంటంటే?

భారత్ – ఒమన్ మధ్య FTA.. జూన్‌ 1 నుంచి అమల్లోకి! ప్రయోజనాలు ఏంటంటే?


భారత్ – ఒమన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. డిసెంబర్ 2025లో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే, రెండు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడి సంబంధాలు మరింత బలపడనున్నాయి. ఒమన్ ప్రతినిధి బృందంతో సమావేశమైన అనంతరం గోయల్ మాట్లాడుతూ.. వాణిజ్యం, పెట్టుబడులను విస్తరించే మార్గాలపై చర్చలు జరిగాయని చెప్పారు. ఈ ఒప్పందం ప్రకారం, వస్త్రాలు, వ్యవసాయ ఉత్పత్తులు, తోలు వస్తువులు వంటి భారత ఎగుమతుల్లో దాదాపు 98 శాతం ఉత్పత్తులకు ఒమన్ మార్కెట్లో సుంకం రహిత ప్రవేశం లభించనుంది.

దీంతో భారత ఎగుమతిదారులకు గల్ఫ్ ప్రాంతంలో కొత్త అవకాశాలు ఏర్పడతాయని భావిస్తున్నారు. అదే సమయంలో ఖర్జూరాలు, పాలరాయి, పెట్రోకెమికల్స్ వంటి ఒమన్ ఉత్పత్తులపై భారత్ సుంకాలను తగ్గించనుంది. ఈ చర్య వల్ల ద్వైపాక్షిక వాణిజ్య పరిమాణం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక చీలీతో జరుగుతున్న వాణిజ్య చర్చలపై కూడా గోయల్ స్పందించారు. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థల పరిమాణంలో వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, కీలక ఖనిజాల రంగంలో సహకారం పెరిగితే సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) కుదిరే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

భారత్, చిలీ ఇప్పటికే 2006లో ప్రాధాన్యతా వాణిజ్య ఒప్పందం (PTA) అమలు చేశాయి. ఇప్పుడు దానిని విస్తరించి డిజిటల్ సేవలు, పెట్టుబడులు, MSMEలు, కీలక ఖనిజాలు వంటి రంగాలను కలుపుతూ CEPAగా మార్చేందుకు చర్చలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా లిథియం, రాగి వంటి ఖనిజాల్లో చిలీ ప్రపంచంలో ప్రముఖ దేశంగా ఉండటంతో, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సౌరశక్తి రంగాలకు భారత్‌కు ఇది వ్యూహాత్మకంగా కీలకమవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *