
రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై సచివాలయంలో అధికారులతో సీఎస్ ఉన్నతస్థాయి సమావేశంలో నిర్వహించారు. ఈ సమావేశానికి దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. పుష్కరాల సమయంలో లక్షలాది మంది భక్తులు గోదావరి తీరం వైపు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
నిజామాబాద్ జిల్లా కందకుర్తి నుంచి బాసర, భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రాంతం విస్తరించి ఉంది. మొత్తం 8 జిల్లాల్లో పుష్కర స్నానాలకు భారీగా జనసంద్రం కనిపించే అవకాశం ఉండటంతో ప్రత్యేక దృష్టి సారించాలని సీఎస్ స్పష్టం చేశారు.ఇప్పటికే ముఖ్యమంత్రి ఇచ్చిన సూచనల మేరకు పుష్కరాల ఏర్పాట్లపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ ప్రతిపాదనలను కేబినెట్ సబ్ కమిటీకి సమర్పించాలని సూచించారు.
అలాగే, ఇప్పటికే నియమించిన ఈఎన్సీలు, చీఫ్ ఇంజనీర్ల కమిటీ రూపొందించిన పనులను సమగ్రంగా పరిశీలించాలని సీఎస్ తెలిపారు. పుష్కరాల సమయంలో మౌలిక సదుపాయాలు, భద్రత, రవాణా వంటి అంశాల్లో ఎలాంటి లోపాలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను అప్రమత్తం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
