
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సామాన్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఈ యుద్ధ ప్రభావం చమురు సరఫరాపై పడడడంతో జనం అప్రమత్తమవుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు ఈ భయాన్ని మరింత పెంచుతున్నాయి. పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు డబ్బాలు, డ్రమ్ములు, చివరకు పెద్ద పెద్ద నీటి ట్యాంకులతో క్యూ కడుతున్న దృశ్యాలు కలకలం రేపుతున్నాయి.
నిపుణులు ఏమంటున్నారు..?
ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని, నిల్వలు నిండుగా ఉన్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అనవసరపు ఆందోళనతో ఇంధనాన్ని నిల్వ చేయడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
ఇంట్లో ఎంత పెట్రోల్ నిల్వ చేయవచ్చు..?
చమురు నిల్వపై దేశంలో కఠినమైన చట్టాలు ఉన్నాయి. పెట్రోలియం నిబంధనలు 2002 ప్రకారం ఒక సాధారణ వ్యక్తి తన వద్ద ఎంత ఇంధనం ఉంచుకోవచ్చనే అంశంపై స్పష్టమైన పరిమితులు ఉన్నాయి. ఒక వ్యక్తి లైసెన్స్ లేకుండా గరిష్టంగా 30 లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్ను మాత్రమే ఇంట్లో నిల్వ ఉంచుకోవచ్చు. ఇంధనాన్ని నిల్వ చేసే కంటైనర్లు లోహంతో లేదా ప్రత్యేక రకం ప్లాస్టిక్తో తయారై ఉండాలి. మూతలు చాలా గట్టిగా ఉండాలి. కంటైనర్లో కొంత ఖాళీ స్థలం వదిలివేయాలి. దీనివల్ల గాలి ప్రసరణ జరిగి, లోపల ఒత్తిడి పెరగకుండా ఉంటుంది. తద్వారా అగ్ని ప్రమాదాలను నివారించవచ్చు.
30 లీటర్ల కంటే ఎక్కువ కావాలంటే..?
ఒకవేళ మీరు 30 లీటర్ల కంటే ఎక్కువ ఇంధనాన్ని నిల్వ చేయాలనుకుంటే, స్థానిక పెట్రోలియం అథారిటీ నుండి ముందస్తు లైసెన్స్ పొందడం తప్పనిసరి. అనుమతి లేకుండా ఎక్కువ మొత్తంలో నిల్వ చేయడం చట్టరీత్యా నేరం.
చట్ట ఉల్లంఘన జరిగితే కఠిన శిక్షలు
పెట్రోలియం చట్టం 1934 ప్రకారం నిబంధనలు అతిక్రమిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.
మొదటిసారి పట్టుబడితే: ఒక నెల జైలు శిక్ష లేదా రూ.1,000 జరిమానా విధిస్తారు.
రెండోసారి ఉల్లంఘిస్తే: మూడు నెలల వరకు జైలు శిక్ష, రూ.5,000 వరకు జరిమానా పడుతుంది.
బ్లాక్ మార్కెటింగ్: పెట్రోల్ను నిల్వ చేసి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తూ పట్టుబడితే ఏకంగా 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
యుద్ధ వార్తల నేపథ్యంలో భయాందోళనలకు గురై నిబంధనలకు విరుద్ధంగా ఇంధనాన్ని నిల్వ చేసుకోవడం ప్రమాదకరం. ఇది కేవలం చట్టపరమైన చిక్కులకే కాదు, మీ ఇంట్లో భారీ అగ్నిప్రమాదాలకు కూడా దారితీయవచ్చు. కాబట్టి, బాధ్యతాయుతంగా వ్యవహరించడం అందరికీ శ్రేయస్కరం.
