
ఒకే గ్రామం.. కొన్ని గంటల వ్యవధి.. ఇద్దరి ప్రాణాలను గుండెపోటు బలిగొంది. ఉదయం లేచే సమయానికి ఒక కుటుంబంలో విషాదం నిండితే.. కొద్ది గంటలకే మరో ఇంట్లోనూ అదే విషాదం చోటుచేసుకుంది. వరుసగా ఇద్దరు గుండెపోటుతో మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బోడబండ గ్రామంలో అదే గ్రామానికి చెందిన బి. వెంకటేష్ (37) గురువారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో గుండెపోటుకు గురయ్యాడు. ఇంటి వద్దే ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. కేవలం 37 ఏళ్లకే వెంకటేష్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉండటంతో.. వారి భవిష్యత్తు తలచుకుని కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కలచివేశాయి.
వెంకటేష్ మృతితో గ్రామంలో విషాదం నెలకొన్న కొద్దిసేపటికే మరో పక్క అదే గ్రామంలో నివాసం ఉంటున్నా మరో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మదిరి నరసింహులు (70) కు ఉదయం 9 గంటల సమయంలో ఛాతిలో నొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆయన తుదిశ్వాస విడిచారు.
ఇలా ఒకే రోజు.. గంటల వ్యవధిలోనే ఇద్దరు గ్రామస్తులు గుండెపోటుతో మృతి చెందడంతో బోడబండలో విషాదం మరింత విషాదంగా మారింది. నరసింహులుకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రెండు కుటుంబాల్లోనూ ఆప్తులను కోల్పోయిన బాధతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి గ్రామస్తులను కలచివేసింది.
ఉదయం నుంచి గ్రామంలో వినిపించిన రోదనలు వరుసగా రెండు కుటుంబాల్లో చోటుచేసుకున్న విషాదం,బోడబండ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. చిన్న గ్రామంలో ఒకే సమయంలో ఇద్దరు గుండెపోటుకు గురై మృతి చెందడంతో గ్రామస్తులు టెన్షన్ పడుతున్నారు.
