ఆగస్టు 26న హిమాలయాల ఎత్తైన పర్వత ప్రాంతాల్లో అంతా సాధారణంగానే కనిపించింది. కానీ కొద్ది క్షణాల్లోనే పరిస్థితి ఊహించని రీతిలో మారిపోయింది. చైనాలోని జిజాంగ్ ప్రాంతంలో విపత్తు ప్రారంభ దశను రికార్డు చేసిన వీడియో ఇప్పుడు ఈ ఘటన వెనుక జరిగిన పరిణామాలను అర్థం చేసుకోవడంలో కీలక ఆధారంగా మారింది. పర్వత శిఖరం నుంచి మంచు, భారీ రాళ్లు, మట్టి, శిథిలాలు ఒక్కసారిగా కిందికి దూసుకొస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. నిపుణుల ప్రాథమిక అంచనా ప్రకారం, హిమనదంలోని భారీ భాగం విరిగిపడటమే నేపాల్-చైనా సరిహద్దు ప్రాంతంలో సంభవించిన వినాశకర డెబ్రిస్ ఫ్లడ్కు కారణమైంది. ఈ విపత్తులో ఇప్పటివరకు 579 మంది మృతి చెందినట్లు సమాచారం. నేపాల్తో పాటు భారత్, చైనా ప్రజలు బాధిత కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
5,200 మీటర్ల ఎత్తులో విరిగిన హిమనదం
ఉపగ్రహ చిత్రాలు, రిమోట్ సెన్సింగ్ విశ్లేషణల ప్రకారం.. సముద్ర మట్టానికి సుమారు 5,200 మీటర్ల ఎత్తులో ఉన్న హిమనదంలోని భారీ భాగం విరిగిపోయింది. మంచుతో పాటు భారీ రాళ్లు కిందనున్న లోయలోకి సుమారు 1,200 మీటర్లు పడిపోయాయి. కిందికి వస్తున్న సమయంలో ఆ మంచు, రాళ్ల ప్రవాహం తన దారిలో ఉన్న మట్టి, రాళ్లు, మొరైన్ పదార్థాలు, నీటిని కలుపుకుంది. దీంతో అది అత్యంత శక్తివంతమైన డెబ్రిస్ ఫ్లోగా మారి లోయల వైపు విరుచుకుపడింది. చైనా నిపుణుడు గువో జావోచెంగ్ అంచనా ప్రకారం.. ఈ శిథిల ప్రవాహం ప్రభావితమైన ప్రాంతం 20 కిలోమీటర్లకు పైగా విస్తరించింది. దీని వేగం సెకనుకు సుమారు 50 మీటర్లు ఉన్నట్లు అంచనా. అంటే క్షణాల్లోనే ప్రమాదం విస్తరించడంతో ప్రజలకు తప్పించుకునే అవకాశం కూడా లేకుండా పోయింది.
ఏడు నిమిషాల్లో విధ్వంసం
ఈ విపత్తులో అత్యంత భయంకరమైన అంశం దాని వేగమే. పర్వతాల నుంచి దూసుకొచ్చిన మంచు, రాళ్లు, మట్టి ప్రవాహం తన దారిలోని పదార్థాలన్నింటినీ కలుపుకుంటూ మరింత శక్తివంతమైంది. కేవలం కొన్ని నిమిషాల్లోనే భారీ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. నిపుణుల అంచనాల ప్రకారం, కీలక ప్రాంతాలకు ఈ విధ్వంసకర ప్రవాహం సుమారు ఏడు నిమిషాల్లోనే చేరింది. అమెరికా భూగర్భ శాస్త్ర సంస్థ (USGS) ప్రాథమిక విశ్లేషణ ప్రకారం, ఈ డెబ్రిస్ ఫ్లో, వరద ప్రభావం కొన్ని ప్రాంతాల్లో మూలస్థానం నుంచి 100 కిలోమీటర్ల దిగువ వరకు కనిపించింది.
A tourist filming the scenery in Gyirong County, China’s Xizang Autonomous Region, accidentally captured the moment of a high-altitude glacier collapse in Nepal.
Kang Shichang, director of the Institute of Mountain Hazards and Environment under the Chinese Academy of Sciences,… pic.twitter.com/Sc3lIbjKWo— China Xinhua News (@XHNews) August 29, 2026
గ్యిరోంగ్ పోర్టులో తీవ్ర కల్లోలం
నేపాల్ పర్వత ప్రాంతంలో ప్రారంభమైన ఈ ప్రకృతి విపత్తు చైనాలోని గ్యిరోంగ్ పోర్టు వరకు చేరింది. నేపాల్-చైనా మధ్య కీలక వాణిజ్య మార్గంగా ఉన్న ఈ సరిహద్దు ప్రాంతం తీవ్రంగా ప్రభావితమైంది. వేగంగా దూసుకొచ్చిన నీరు, శిథిలాలు రహదారులు, భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలను దెబ్బతీశాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో భారీ నీటి ప్రవాహం, రాళ్లు, శిథిలాలు పోర్టు వైపు దూసుకొస్తుండగా.. ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీస్తున్న దృశ్యాలు కనిపించాయి. చైనా అధికారులు రహదారి రాకపోకలు, విద్యుత్ సరఫరా, కమ్యూనికేషన్ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వెల్లడించారు.
ప్రమాదానికి కారణం భూకంపమా?.. హిమనద విరుగుడా?
ఈ ఘటన జరిగిన తొలినాళ్లలో భూకంపం కారణంగా ఈ విపత్తు సంభవించి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే అనంతరం అందుబాటులోకి వచ్చిన వీడియోలు, ఉపగ్రహ చిత్రాలు, శాస్త్రీయ విశ్లేషణలతో పరిస్థితి మరింత స్పష్టమైంది. USGS కూడా తన ప్రాథమిక అంచనాలో హిమనదం విరిగిపడటమే భారీ డెబ్రిస్ ఫ్లో, వరదకు ప్రధాన కారణంగా ఉండొచ్చని పేర్కొంది. అయితే హిమనదం ఎందుకు విరిగింది? దానికి వాతావరణ మార్పులు, మంచు కరుగుదల లేదా ఇతర భౌగోళిక కారణాలు దోహదపడ్డాయా? అనే అంశాలపై నిపుణులు మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నారు.
పర్యాటకుడి వీడియో.. విపత్తు రహస్యానికి కీలక ఆధారం
సాధారణంగా పర్వతాల అందాలను చిత్రీకరించేందుకు తీసినట్లు కనిపిస్తున్న ఓ పర్యాటకుడి వీడియో ఇప్పుడు ఈ విపత్తును అర్థం చేసుకోవడంలో అత్యంత కీలక ఆధారంగా మారింది. వీడియోలో కనిపిస్తున్న ప్రాంతం, ఉపగ్రహ చిత్రాల్లో నిపుణులు గుర్తించిన విపత్తు మూల ప్రాంతం ఒకటేనని చైనా నిపుణులు చెబుతున్నారు. ఆ వీడియోతో పాటు రిమోట్ సెన్సింగ్ చిత్రాలను పరిశీలిస్తూ.. హిమనదం విరగడం నుంచి మంచు, రాళ్లు లోయలోకి పడటం, నీటి ప్రవాహం మారడం, చివరకు భారీ డెబ్రిస్ ఫ్లడ్గా మారడం వరకు జరిగిన పరిణామాలను శాస్త్రవేత్తలు పునర్నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ ఘటన హిమాలయ ప్రాంతంలోని హిమనదాల స్థిరత్వంపై మరోసారి తీవ్రమైన ఆందోళనలను రేకెత్తించింది. ఎత్తైన పర్వత ప్రాంతాల్లో చిన్న మార్పు కూడా క్షణాల్లో భారీ విపత్తుగా మారే ప్రమాదం ఉందని ఈ సంఘటన మరోసారి ప్రపంచానికి హెచ్చరికగా నిలిచింది.
