తాజావార్తలు

Power Cuts: మీ ఇంట్లో కరెంట్ పోయిందా..? ఇక నుంచి వాట్సప్‌లోనే ఫిర్యాదు చేయొచ్చు.. సెకన్లలోనే ప్రాబ్లం క్లియర్..

Power Cuts: మీ ఇంట్లో కరెంట్ పోయిందా..? ఇక నుంచి వాట్సప్‌లోనే ఫిర్యాదు చేయొచ్చు.. సెకన్లలోనే ప్రాబ్లం క్లియర్..


కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయాలనేది చాలామందికి తెలియదు. లైన్‌మెన్ నెంబర్ ఉంటే వారికి కాల్ చేసి అడుగుతూ ఉంటారు. ఇక కొంతమంది కరెంట్ బిల్లుపై ఉండే హెల్ప్‌లైన్ నెంబర్‌కు కాల్ చేస్తారు. తెలంగాణలో విద్యుత్ వినియోగదారుల కోసం 1912 నెంబర్‌ అందుబాటులో ఉంది. కరెంట్ సరఫరా, ఇతర ఫిర్యాదుల కోసం ఈ నెంబర్‌కు కాల్ చేసి సమాచారం పొందటంతో పాటు ఫిర్యాదులు చేసే అవకాశముంది. ప్రస్తుతం కరెంట్ పోయినప్పుడు చాలామంది 1912 నెంబర్‌కు కాల్ చేసి సమాచారం తెలుసుకుంటున్నారు. అయితే ఇక నుంచి వాట్సప్‌లో కూడా విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ మేరకు తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(టీజీఎస్‌పీడీసీఎల్) కీలక నిర్ణయం తీసుకుంది. వాట్సప్ ద్వారా విద్యుత్ వినియోగదారులు సమాచారం,ఫిర్యాదు చేసేలా సరికొత్త విధానం అమల్లోకి తెచ్చింది.

ప్రాంతాల వారీగా ప్రత్యేక వాట్సప్ గ్రూపులను టీజీఎస్‌పీడీసీఎల్ ఏర్పాటు చేయనుంది. ఈ గ్రూపులో లైన్‌మెన్‌తో పాటు లైన్ ఇన్‌స్పెక్టర్, ఏఈలు ఉంటారు. విద్యుత్ కొతలతో పాటు నిర్వహణ పనులు వంటి సమాచారాన్ని ముందుగానే విద్యుత్ వినియోగదారులకు దీని ద్వారా సమాచారం అందిస్తారు. 1912 కాల్ సెంటర్‌కు ప్రత్యామ్నాయంగా ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతీ విద్యుత్ సెక్షన్ పరిధిలో ప్రత్యేక వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేయనున్నారు. అవసరమైతే ఫీడర్, డీటీఆర్ లెవల్‌లో కూడా గ్రూపులు నెలకొల్పనున్నారు. విద్యుత్ తీగలు తెగిపోవడం, ట్రాన్స్‌ఫార్మర్ సమస్యలు, తక్కువ ఓల్టోజ్ వంటి సమస్యలను ఈ వాట్సప్ గ్రూపులో వినియోగదారులు నివేదించవచ్చు. దీంతో వెంటనే సిబ్బంది స్పందించి సమస్యలను పరిష్కరిస్తారు. ఇక ఈ గ్రూపులోని విద్యుత్ అంతరాయాలు, అత్యవసర మరమ్మత్తులు, ఇతర పనులకు సంబంధించి సమాచారాన్ని ప్రజలు అందిస్తారు. ప్రజలకు ముందే సమాచారం తెలియజేయడం వల్ల అనవసర ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంటుంది.

వాట్సప్ విధానం వల్ల ప్రజలు నేరుగా అధికారులను సంప్రదించవచ్చు. ఇప్పటివరకు 1912 కాల్ సెంటర్‌కు కాల్ చేయాల్సి వచ్చేది. కొన్ని సమయంలో కాల్ కనెక్ట్ కాకపోవడంతో పాటు ఫిర్యాదు ఎక్కువగా వచ్చినప్పుడు సిబ్బంది వెంటనే స్పందించలేకపోతున్నారు. దీని వల్ల సేవల్లో జాప్యం జరుగుతోంది. దీనిని  తగ్గించి ప్రజలకు వేగవంతంగా సేవలు అందించేందుకు టీజీఎస్‌పీడీసీఎల్ వాట్సప్ సేవలను వినియోగించుకుంటోంది. దీని వల్ల సెకన్లలోనే ప్రజలకు సమాచారాన్ని తెలియజేయవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *