తాజావార్తలు

అమరావతిని ఆపడం ఎవరి తరం కాదు.. ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

అమరావతిని ఆపడం ఎవరి తరం కాదు.. ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!


దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్న ప్రతిష్టాత్మక ‘వీబీజీ రామ్ జీ’ (వికసిత్ భారత్ గ్రీన్ – రాష్ట్రీయ గ్రామీణ మౌలిక సదుపాయాలు) పథకం పేదల జీవితాలనే మార్చే పథకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ముక్కావారిపల్లె సభ నుంచి VBG RAM G పథకాన్ని సీఎం చంద్రబాబు ఘనంగా ప్రారంభించారు. గతంలో నరేగా పథకం రాయలసీమ నుంచే ప్రారంభమైందని, ఇప్పుడు ఈ చారిత్రాత్మక పథకం కూడా ఇక్కడి నుంచే ఆవిష్కృతం కావడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రూపురేఖలను మార్చేలా పథకాన్ని అమలు చేస్తామన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కేంద్రం నుంచి రూ.7,700 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.4 వేల కోట్ల వ్యయంతో ఈ పథకం కింద భారీగా అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ప్రకటించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సారధ్యంలో 125 రోజుల పనిదినాలతో గ్రామీణాభివృద్ధికి కావాల్సిన రహదారులు, డ్రైనేజీలు, కాలువలు వంటి మౌలిక వసతుల కల్పనకు ఈ పథకాన్ని వినియోగిస్తామన్నారు. జియో ట్యాగింగ్, బయోమెట్రిక్ సాంకేతికతతో పూర్తి పారదర్శకత పాటిస్తామని, పొలాలకు వెళ్లే డొంక రోడ్లను కూడా దీని కింద నిర్మిస్తామని చెప్పారు. గతంలో 13,226 గ్రామాల్లో ఒకేసారి గ్రామసభలు నిర్వహించి గిన్నీస్ రికార్డు సృష్టించిన ఘనత పవన్ కల్యాణ్‌కే దక్కుతుందన్నారు.

గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన 93 కేంద్ర పథకాలను కూటమి ప్రభుత్వం పునరుద్ధరించిందని, జల్ జీవన్ మిషన్ సహా వివిధ పథకాలకు రూ.28 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. “అమరావతిని ఆపడం ఎవరి తరం కాదు, పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల కంటే ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం” అని చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను నిలబెట్టడంతో పాటు రైల్వే జోన్ సాధించామని, గూగుల్ డేటా సెంటర్, తిరుపతిలో బుల్లెట్ మోటార్ సైకిల్ ప్లాంట్ వంటి భారీ ప్రాజెక్టులు రాష్ట్రానికి వస్తున్నాయని వివరించారు.

రాయలసీమను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుపుతామని, మదనపల్లిలో త్వరలోనే హార్టికల్చర్ హబ్ కు శంకుస్థాపన చేస్తామని సీఎం ప్రకటించారు. తోతాపురి మామిడి రైతులకు, రహదారులకు నిధులిచ్చి ఆదుకున్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని, ‘వికసిత్ భారత్ – స్వర్ణాంధ్ర’ సంకల్పంతో ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *