అమరావతి, మే 1: పదో తరగతి నకిలీ మార్కుల జాబితాలపై రాష్ట్ర విద్యాశాఖ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఫేక్ వెబ్సైట్లు, తప్పుడు మార్కుల జాబితాలతో తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఏపీ మార్కుల జాబితాలపై తెలంగాణ ప్రభుత్వ లోగోతో కొందరు దుండగులు గందరగోళం సృష్టించారు. దీంతో రంగంలోకి దిగిన విద్యాశాఖ నకిలీ వెబ్సైట్లపై కొరడా జులిపించింది. నెట్టింట చక్కర్లు కొడుతున్న ఇలాంటి నకిలీ వెబ్సైట్లను గుర్తించినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు.
గత ప్రభుత్వ అధికారుల ఫొటోలతో ఉన్న ఫేక్ వెబ్సైట్ లింకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తప్పుడు వార్తలను నమ్మవద్దని విద్యాశాఖ విజ్ఞప్తి చేసింది. నకిలీ ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులు పోలీసులను కోరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ గురువారం (ఏప్రిల్ 30) విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో మొత్తం 85.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షలకు పైగా విద్యార్ధులు ఈ పరీక్ష ఫలితాలు చెక్ చేసుకున్నారు. ఇదే అదనుగా కొందరు దుండగులు గందరగోళం సృష్టించడానికి నకిలీ వెబ్సైట్లు సృష్టించి నకిలీ మార్కుల మెమోలను జారీ చేశారు. రంగంలోకి దిగిన విద్యాశాఖ ఈ వెబ్సైట్లను గుర్తించి చర్యలు చేపట్టింది.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.
