యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేవస్థానానికి నూతన బోర్డును ఏర్పాటు చేసింది. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట ఆలయానికి నూతన బోర్డును ఏర్పాటు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ తరహాలోనే ఈ బోర్డుకు చైర్మన్, ఇతర సభ్యులను తాజాగా నియమించింది. బోర్డు చైర్మన్గా ఎం.సత్యనారాయణ రెడ్డికి అవకాశం కల్పించగా.. సభ్యులు, ఎక్స్-అఫీషియో సభ్యులను కూడా నియమించింది. మొత్తం 18 మందితో కూడిన బోర్డును ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ బోర్డులో సభ్యురాలిగా మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ కొణిదెలకు చోటు దక్కింది.
బోర్డు సభ్యులు వీళ్లే..
ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, కొణిదెల సురేఖ, చిలప్పగారి విజయరాజం, తుల్ల విజయేందర్, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, గుండు మల్లయ్య, కంటమాని స్వాతి, ఏం రాఘవేంద్రరావు, లక్ష్మీనారాయణ నాయక్, ది ఫౌండర్ ట్రస్టీ ఉన్నారు. ఇక ఎక్స్-అఫీషియో సభ్యులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ (ఎండోమెంట్స్) శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, దేవాదాయ శాఖ కమిషనర్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్, యాదగిరిగుట్ట దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సీనియర్ ప్రధాన అర్చకులను నియమించారు. రెండేళ్ల పాటు ఈ బోర్డు సభ్యులు పదవిలో కొనసాగుతారు. త్వరలో కొత్త సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
