అయోధ్య రామాలయంలో భక్తులు సమర్పించిన విరాళాల చోరీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. నిందితుల మూలాలను వెతుకుతున్న పోలీసులకు తాజాగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన నిందితుడి భార్య బ్యాంకు ఖాతాలో భారీగా నగదు లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన పోలీసులు, ఈ కేసును మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఆలయ మేనేజర్ గోపాల్ రావుతో పాటు మరో పది మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ప్రధాన నిందితులైన లవకుష్, అనుకల్ప్, కరుణేష్లు నివసించే మిల్కీపూర్, ఖండా, రుదౌలీ గ్రామాల్లో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో కొన్ని అత్యంత కీలకమైన పత్రాలతో పాటు ఒక రహస్య పెట్టెను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసులో మరింత పురోగతి కోసం లవకుష్ తండ్రి బచ్చులాల్ మిశ్రాను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
పోలీసుల దర్యాప్తులో అత్యంత కీలకంగా మారిన అంశం ప్రధాన నిందితుడు లవకుష్ భార్య సుప్రియ బ్యాంక్ ఖాతా. ఆమె ఖాతాను పరిశీలించిన అధికారులకు షాక్ తగిలింది. ఒక సాధారణ గృహిణి అయిన సుప్రియ ఖాతాలో ఏడాది కాలంలో ఏకంగా రూ. 24 లక్షల వరకు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. సాధారణ కుటుంబ నేపథ్యం ఉన్న సుప్రియ ఖాతాలోకి ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనేది ఇప్పుడు పోలీసుల ముందున్న ప్రధాన ప్రశ్న. ఈ సొమ్ము విరాళాల చోరీకి సంబంధించినదా? లేక ఇంకా ఎవరైనా పెద్దల హస్తం ఉందా? అనే కోణంలో పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ అక్రమ లావాదేవీల వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. రాబోయే రోజుల్లో ఈ కేసులో మరిన్ని కీలక అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
