తాజావార్తలు

అన్నం కాదు లంచాలు తింటాడు.. అవినీతిలో నెం1 ఆఫీసర్.. ధనహరి ఆస్తుల చిట్టా తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే

అన్నం కాదు లంచాలు తింటాడు.. అవినీతిలో నెం1 ఆఫీసర్.. ధనహరి ఆస్తుల చిట్టా తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే


వాళ్లను టచ్ చేస్తే కోట్లే. దోచుకునేందుకు ఆ ఆఫీసర్లకు అలుపురాలేదు కానీ, దోచుకున్న సొమ్మును లెక్కపెట్టడానికి, ఆస్తుల చిట్టా తేల్చడానికి, ఏసీబీకి మాత్రం చెమటలు పడుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ నోట్ల కట్టలు, బంగారు ఆభరణాలు, వజ్రాల మూటలు, ఎలా దోచుకున్నాడో కానీ అవినీతిలో అంతకుమించి అనేంతగా ఒదిగిపోయాడా అధికారి. ఈమధ్యకాలంలో పట్టుబడుతున్న అధికారుల అవినీతిలో ఇతడే నంబర్‌ వన్‌.. అవినీతిలో ఒలంపిక్స్‌ లాంటి గేమ్ పెడితే టాప్‌లో కచ్చితంగా ఉండే ఆఫీసర్.. బహుశా ఇతగాడేనేమో.. పద్దతిగా బట్టలు తొడిగినట్లుగా కనిపించే ఇతని అసలు స్వరూపం.. కరెప్షన్ కరెప్షన్ కరెప్షన్.. లంచం ఇవ్వనిదే కంచం కూడా ముట్టని కరెప్టెడ్ ఆఫీసర్లలో ఇతని పేరు ఫస్ట్‌లోనే రాయొచ్చు. ఆస్తుల చిట్టా విప్పితే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడా… లేక ప్రైవేట్ సామ్రాజ్యం నిర్మించుకున్నాడా అన్న అనుమానాలు కలిగించేలా…ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఆస్తుల లెక్క ఉంది. ఏసీబీ దాడులు చేస్తే… బీరువాలు తెరిచిన కొద్దీ నోట్లు.. లాకర్లు తెరిచిన కొద్దీ బంగారం.. ఫైళ్లు తిప్పిన కొద్దీ భూములు.. ఖాతాలు పరిశీలించిన కొద్దీ కోట్ల పెట్టుబడులు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తులే వంద కోట్లకు పైగా ఉంటే… ఇంకా లెక్క తేలాల్సినవి ఎన్ని అన్నది ఏసీబీకే అర్థం కావడం లేదు.

నరహరి… ల్యాండ్ అండ్ సర్వే శాఖలో డిప్యూటీ డైరెక్టర్. భూములకు సంబంధించిన ఫైళ్లు… సర్వేలు… సరిహద్దు వివాదాలు… రికార్డుల సవరణలు… ఇలా కోట్ల రూపాయల విలువైన భూములకు సంబంధించిన కీలక వ్యవహారాలు ఆయన టేబుల్ మీదకే వెళ్లేవి. ఇంకేముంది జీతం కంటే జీవితంలో సంపాదించడమే ముఖ్యమన్నట్టుగా దోచుకోవడం మొదలుపెట్టాడు. ఇతని దోపిడీకి సంబంధించి, నెలల తరబడి సీక్రెట్‌గా సమాచారం సేకరించిన అధికారులు.. మంగళవారం ఒకేసారి 12 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేశారు. ఉదయం మొదలైన తనిఖీలు… రాత్రి దాటినా కొనసాగాయి. ఒక టీమ్ ఆస్తుల లెక్కలు తీయగా… మరో టీమ్ నరహరి ఆస్తుల చిట్టాపై ఫోకస్ పెట్టింది.

నరహరి ఇంట్లో సోదాలు నిర్వహిస్తుండగా, టీవీ9 కూడా అక్కడకు వెళ్లింది. ఏసీబీ సోదాల్లో బయటపడుతున్న ఆస్తుల చిట్టాను చూసి అక్కడి అధికారులే నోరెళ్లబెడుతున్న పరిస్థితి. సోదాలు మొదలైన కొద్ది నిమిషాల్లోనే అధికారులకు పరిస్థితి అర్థమైంది. ప్రాథమికంగా కోటిన్నర రూపాయలకుపైగా నగదు… కిలో పైగా బంగారం… సుమారు ఎనిమిది కిలోల వెండి… భారీ FDలు గుర్తించారు. పడక గదిలో బీరువా.. దాని పైన కప్‌బోర్డులో.. నిండా 500 రూపాయల నోట్ల కట్టలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అవి లెక్కించి రూ.1.54 కోట్లను స్వాధీనం చేసుకున్నారు.

నగదు, బంగారం మాత్రమే కాదు… రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం కూడా వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లాలో దాదాపు ఒకటిన్నర ఎకరాల వ్యవసాయ భూమి… పుప్పాలగూడలో ఫ్లాట్… రాజేంద్రనగర్‌లో మరో ఫ్లాట్… నార్సింగిలో హైఎండ్ అపార్ట్‌మెంట్… గచ్చిబౌలిలో ఖరీదైన భవనం… టీఎన్‌జీవో కాలనీలో ఆస్తులు… రంగారెడ్డి జిల్లాలో ఐదు ఓపెన్ ప్లాట్లు… ఇలా ఒక్కో డాక్యుమెంట్ బయటపడుతున్న కొద్దీ… అక్రమాస్తుల జాబితా పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువే వంద కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ ప్రాథమికంగా అంచనా వేస్తోంది.

ఇటీవలి కాలంలో తెలంగాణలో బయటపడుతున్న అవినీతి కేసుల్లో ఇది మరో పెద్ద అవినీతి కేసు. కొద్దిరోజుల కిందటే ఆర్ అండ్ బీ ఇంజినీర్ ఇన్ చీఫ్ మోహన్ నాయక్ ఇళ్లపై దాడులు జరిగాయి. సోదాల్లో ఆదాయానికి 300 శాతం మించిన ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించింది.

అంతకుముందు మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ వ్యవహారం కూడా సంచలనం సృష్టించింది. తహశీల్దార్‌గా పనిచేసిన సమయంలోనే రియల్ ఎస్టేట్ లావాదేవీలు చేశారన్న అనుమానంతో ఏసీబీ విచారణ చేపట్టగా… వంద కోట్లకు పైగా అక్రమాస్తులు బయటపడ్డాయి. అదే విధంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో సస్పెండ్ అయిన అదనపు ఎస్పీ నాయిని భుజంగరావు ఇళ్లలో కూడా ఏసీబీ దాడులు చేసింది. హైదరాబాద్ నుంచి నల్లగొండ వరకు… విల్లాలు… కమర్షియల్ కాంప్లెక్స్‌లు… వ్యవసాయ భూములు… బంగారం… నగదు… ఇలా పెద్ద ఎత్తున ఆస్తులు గుర్తించింది. ఇదే తరహాలో HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ… జలమండలి మాజీ జీఎం అనంతలక్ష్మి కుమార్ కేసులు కూడా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.

ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రజల సేవ కోసం. కానీ అదే పదవిని వ్యక్తిగత సంపదకు మెట్టుగా మార్చుకుంటే… ఒకరోజు లాకర్లు తెరుచుకుంటాయి… బీరువాలు మాట్లాడతాయి… ఫైళ్లు సాక్ష్యాలవుతాయి. నరహరి కేసు అదే చెబుతోంది. ఒక అధికారి సంపాదించిన సంపద ఎంతన్నది మాత్రమే కాదు… ప్రజా వ్యవస్థలో అవినీతి ఎంత లోతుగా వేళ్లూనుకుపోయిందన్న ప్రశ్నను కూడా ఈ దాడుల్లో బయటపడుతున్న అక్రమసంపాదనే బెస్ట్ ఎగ్జాంపుల్. అన్నమే తింటున్నారా? లేదంటే లంచాలేనా!! అని జనం నివ్వెరపోయే రేంజ్‌లో అవినీతి అధికారుల అక్రమాస్తులు తెరపైకి వస్తున్నాయి.

FAQ

ప్రశ్న: ఏసీబీ ఎవరి కోసం పనిచేస్తుంది..?

జవాబు: అవినీతి నిరోధక శాఖ (Anti Corruption Bureau – ACB) ప్రభుత్వ శాఖల్లో అవినీతిని అరికట్టడానికి, లంచగొండి అధికారులపై చర్యలు తీసుకోవడానికి పనిచేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగినా లేదా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం ఉన్నా, ఈ శాఖకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.

ప్రశ్న: ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే ఏం చేయాలి..

జవాబు: ACB toll-free no: 9440446106 కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయండి.. లేదా నేరుగా ACB పోర్టల్ లో కూడా ఫిర్యాదు చేయవచ్చు..

ప్రశ్న: ఫిర్యాదు దారుల పేర్లను బహిర్గతం చేస్తారా..?

జవాబు: ఫిర్యాదుదారుల పేర్లు, వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *