మూవీ రివ్యూ: కర
నటీనటులు: ధనుష్, మమితా బైజు, కె.ఎస్.రవికుమార్, సూరజ్ వెంజరమూడు, జయరామ్ తదితరులు.
సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్
దర్శకత్వం: విఘ్నేష్ రాజా
నిర్మాత: ఐషరి కె.గణేష్ (వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్)
తెలుగు రిలీజ్: విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్
ధనుష్, మమిత బైజు జంటగా విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం కర. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఐషరి కె గణేష్ నిర్మించిన ఈ సినిమాను.. తెలుగు ప్రేక్షకులకు విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ సంయుక్తంగా అందించాయి. ఏప్రిల్ 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో ఇప్పుడు చూద్దాం.
కథ:
దొంగతనాలు చేస్తూ జీవనం సాగించే కరస్వామి అలియాస్ కర (ధనుష్) ఇక ఆ చీకటి బతుకుకు స్వస్తి పలకాలని నిర్ణయించుకుంటాడు. చివరిసారిగా ఓ చోరీకి వెళ్లి తన స్నేహితుడి నిర్లక్ష్యం వల్ల ఇరుక్కుపోతాడు. అదే సమయంలో రిటైర్మెంట్ కు దగ్గరపడిన డిఎస్పీ భరతన్ (సూరజ్ వెంజర్మూడు) తన పరపతిని పెంచుకునేందుకు కరస్వామిపై లేనిపోని కేసులు బనాయించాలని చూస్తాడు. అతన్ని కొట్టి అక్కడినుంచి తప్పించుకున్న కరస్వామి.. మల్లి (మమిత బైజు)ని రహస్యంగా పెళ్లి చేసుకుని ఓ సాధారణ హోటల్ కార్మికుడిగా కొత్త జీవితం మొదలుపెడతాడు. సొంతంగా ఓ వ్యాపారం పెట్టుకునేందుకు బ్యాంకు లోన్ కోసం.. తన పొలం పత్రాలు తేవడానికి పదహారేళ్ల తర్వాత సొంతూరు వెళ్తాడు. కానీ తన తండ్రి (కేఎస్ రవికుమార్) అప్పుల ఊబిలో కూరుకుపోయాడని, పొలం బ్యాంకు తాకట్టులో ఉందని తెలుసుకుంటాడు. కొడుకు తన ఆస్తి కోసమే తిరిగొచ్చాడనే మనోవేదనతో తండ్రి కన్నుమూస్తాడు. తండ్రి చివరి కోరిక మేరకు సొంత పొలంలోనే అంత్యక్రియలు చేయాలనుకుంటే, అప్పు కట్టలేదని బ్యాంకు అధికారులు కోర్టు ఆర్డర్తో అడ్డుకుంటారు. దానికి ప్రతీకారంగా తన తండ్రిని వేధించిన ఆ బ్యాంకునే దోచుకుని అప్పు తీర్చాలని కరస్వామి నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత అతని ప్రయాణం ఎటు దారితీసింది, డిఎస్పీ భరతన్ నుంచి ఎలా తప్పించుకున్నాడు అనేది మిగతా కథ.
కథనం:
ఈ మధ్య కాలంలో పూర్తిగా ఎమోషన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్ ఉన్న కథలనే ఎంచుకుంటున్న ధనుష్.. కర చిత్రంలోనూ అదే ఫార్ములాను ఫాలో అయ్యాడు. ఈ క్రమంలోనే ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ.. హీరో గతం, తండ్రీకొడుకుల బంధం చుట్టూ అల్లిన సన్నివేశాలు బాగున్నాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే బ్యాంక్ చోరీ ఎపిసోడ్ సినిమా గ్రాఫ్ను అమాంతం పెంచేస్తుంది. అక్కడినుంచి సెకండాఫ్పై విపరీతమైన క్యూరియాసిటీ పెరుగుతుంది. ద్వితీయార్థం సస్పెన్స్ ఎలిమెంట్స్తో పాటు వరుస బ్యాంకు దోపిడీలతో ఉత్కంఠభరితంగా నడుస్తుంది. క్లైమాక్స్కు వచ్చేసరికి రైతుల కష్టాలు, తండ్రి ఎమోషన్తో ముగించిన విధానం ఆకట్టుకుంటుంది. అయితే దర్శకుడు విఘ్నేశ్ రాజా మొదటి సినిమాలో ఉన్న థ్రిల్లింగ్ మార్క్ ఇందులో పెద్దగా కనిపించదు. సినిమా మొత్తం ధనుష్ వన్ మ్యాన్ షో లాగా నడుస్తుంది. హీరో ఇంటినుంచి ఎందుకు పారిపోయాడు, హీరోయిన్తో ప్రేమ ఎలా పుట్టింది లాంటి అంశాలను లైట్గా టచ్ చేసి వదిలేసాడు. పైగా బ్యాంకులను పూర్తిగా నెగిటివ్ కోణంలో చూపించడం లాజికల్గా కాస్త అతిశయోక్తిగా అనిపిస్తుంది. అయినా సరే సెకండాఫ్ స్క్రీన్ ప్లే వేగంగా ఉండటం వల్ల ప్రేక్షకుడు ఎక్కడా బోర్ ఫీల్ అవ్వడు.
నటీనటులు:
సహజ నటనకు పెట్టింది పేరైన ధనుష్.. దొంగగా, బాధ్యత గల కొడుకుగా రెండు వేరియేషన్స్లో తనదైన నటనతో అదరగొట్టాడు. క్యూట్ లుక్స్తో అలరించే మమిత బైజు ఈ సినిమాలో పూర్తి డీ గ్లామర్ పాత్రలో మెరిసింది. నిడివి తక్కువే అయినా ఉన్నంతలో అద్భుతంగా నటించింది. వృద్ధుడి పాత్రలో కేఎస్ రవికుమార్ నటన కంటతడి పెట్టిస్తుంది. తన కెరీర్లోనే ఇదొక బెస్ట్ రోల్ అని చెప్పొచ్చు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీసుగా సూరజ్ వెంజర్మూడు పర్ఫెక్ట్గా సరిపోయాడు. జయరాం, కరుణాస్, పృథ్వీ రాజన్ తమ పాత్రల పరిధి మేరకు పూర్తి న్యాయం చేశారు.
టెక్నికల్ టీం:
సాంకేతికంగా సినిమా చాలా ఉన్నతంగా ఉంది. జీవి ప్రకాష్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రాణం పోసింది. పాటలు ఓకే అనిపించినా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది. 90స్ కాలం నాటి వాతావరణాన్ని ఆర్ట్ విభాగం అద్భుతంగా రీక్రియేట్ చేసింది. దానికి తోడు సినిమాటోగ్రఫీ విజువల్స్కు మరింత అందాన్ని తెచ్చింది. ఎడిటింగ్ విషయంలో మొదటి సగంలో ఉన్న కొన్ని సాగతీత సీన్లను కట్ చేసి ఉంటే సినిమా ఇంకాస్త పకడ్బందీగా ఉండేది. ప్రొడక్షన్ వాల్యూస్ కథకు తగ్గట్టుగా ఎక్కడా రాజీ పడకుండా చాలా రిచ్ గా ఉన్నాయి.
పంచ్ లైన్:
ఓవరాల్గా కర.. ఇటు రైతు కష్టం.. అటు థ్రిల్లింగ్ రాబరీ.. మిక్స్డ్ బ్యాగేజ్..!
