మేడ్చల్ జిల్లా కూకట్పల్లి పరిధిలోని కె.పి.హెచ్.బి (KPHB) పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై అతివేగంగా వెళ్తున్న వాటర్ ట్యాంకర్ ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం ఒక యువకుడి మరణానికి కారణమైంది. పోలీసుల వివరాలు, సీసీటీవీ దృశ్యాల ప్రకారం.. 25 ఏళ్ల అభినవ్ కుమార్ మిశ్రా తన ద్విచక్ర వాహనంపై వ్యక్తిగత పనుల నిమిత్తం బయలుదేరారు. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన ఒక వాటర్ ట్యాంకర్ అభినవ్ వాహనాన్ని ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో ట్యాంకర్ డ్రైవర్ అజాగ్రత్తగా వాహనాన్ని ద్విచక్ర వాహనానికి అతి సమీపంలోకి తీసుకురావడంతో సైడ్ నుండి ఢీకొట్టింది.
బ్యాలెన్స్ తప్పి అభినవ్ కింద పడిపోగా, అదే సమయంలో ట్యాంకర్ వెనుక చక్రాలు అతని తల పైనుంచి వెళ్లాయి. ఈ ప్రమాదంలో అభినవ్ తల భాగం పూర్తిగా ఛిద్రమై, చిన్న మెదడు బయటకు వచ్చేసింది. అత్యంత ఘోరమైన ఈ స్థితిలో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. రోడ్డుపై రక్తం మడుగులో పడి ఉన్న దృశ్యం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది.
సమాచారం అందుకున్న వెంటనే కె.పి.హెచ్.బి పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు, ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
నగరంలోని ప్రధాన రహదారులపై, ముఖ్యంగా జాతీయ రహదారులపై ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు భారీ వాహనాలకు (ట్రక్కులు, ట్యాంకర్లు) దూరంగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఓవర్టేక్ చేసేటప్పుడు అప్రమత్తత పాటించకపోవడం వల్ల ఇటువంటి దారుణమైన ప్రాణ నష్టం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడు అభినవ్ కుటుంబంలో ఈ వార్త తీవ్ర విషాదాన్ని నింపింది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
