LSG vs RR : ఐపీఎల్ 2026లో భాగంగా లక్నోలోని ఏకానా స్టేడియం వేదికగా జరిగిన 32వ పోరులో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ లో-స్కోరింగ్ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ను వారి సొంత గడ్డపైనే చిత్తు చేసి, రాజస్థాన్ తన విజయ పరంపరను మళ్లీ మొదలుపెట్టింది. ఐపీఎల్ 2026 సీజన్ 32వ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు సమిష్టిగా రాణించి తమ జట్టుకు 40 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందించారు. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (43*) ఆఖర్లో కీలక ఇన్నింగ్స్ ఆడటంతో రాజస్థాన్ గౌరవప్రదమైన స్కోరును బోర్డుపై ఉంచగలిగింది. లక్నో బౌలర్లలో షమీ, మోహ్సిన్ ఖాన్ చెరో రెండు వికెట్లు తీశారు.
అయితే, 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు ఏ దశలోనూ రాజస్థాన్ బౌలర్లను ఎదిరించలేకపోయారు. ముఖ్యంగా పవర్ప్లేలోనే లక్నో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్ ఆయుష్ బడోని మొదటి ఓవర్లోనే రనౌట్ కాగా, ఆ వెంటనే కెప్టెన్ రిషబ్ పంత్, స్టార్ బ్యాటర్ ఐడెన్ మార్క్రమ్ ఇద్దరూ సున్నా పరుగులకే వెనుదిరిగారు. ఈ ముగ్గురు కీలక ఆటగాళ్లు డకౌట్ అవ్వడం లక్నో ఓటమిని ముందే ఖరారు చేసింది. నికోలస్ పూరన్ (22), హిమ్మత్ సింగ్ (15) కొద్దిసేపు నిలబడే ప్రయత్నం చేసినా రాజస్థాన్ బౌలర్లు వారిని క్రీజులో పాతుకుపోనివ్వలేదు.
మరోవైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్ మిచెల్ మార్ష్ ఒక్కడే లక్నో తరఫున పోరాటం చేశాడు. కేవలం 39 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసి జట్టును గెలిపిస్తాడని ఆశలు రేపాడు. కానీ, 16వ ఓవర్లో జోఫ్రా ఆర్చర్ వేసిన అద్భుతమైన బంతికి మార్ష్ (55) అవుట్ కావడంతో లక్నో ఆశలు ఆవిరయ్యాయి. చివర్లో బ్రిజేష్ శర్మ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి లక్నోను 119 పరుగులకే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
రాజస్థాన్ బౌలింగ్ విభాగంలో ఆర్చర్, బర్గర్, బిష్ణోయ్, జడేజా అంతా కలిసి కట్టుదిట్టమైన బౌలింగ్తో లక్నో నవాబులను కట్టడి చేశారు. వరుసగా మూడు ఓటములతో సతమతమవుతున్న లక్నోకు ఈ పరాజయం మరింత ఆవేదన కలిగించగా, వరుసగా రెండు ఓటముల తర్వాత రాజస్థాన్ మళ్ళీ విజయాల బాట పట్టి పాయింట్ల పట్టికలో టాప్-3 స్థానాన్ని మరింత పదిలపరుచుకుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
