తాజావార్తలు

ఇనుప రాడ్లు, ఖాళీ సీసాలతో పొట్టు పొట్టు కొట్టుకున్నారు..! కారణం ఏంటంటే..

ఇనుప రాడ్లు, ఖాళీ సీసాలతో పొట్టు పొట్టు కొట్టుకున్నారు..! కారణం ఏంటంటే..


మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో పాత కక్షలు భగ్గుమన్నాయి.. హరిచంద్ తండాలో రెండు వర్గాల మధ్య తలెత్తిన గొడవ చిలికి చిలికి గాలివానలా మారి..పరస్పర దాడులకు దారితీసింది. ఇనుప రాడ్లు, ఖాళీ సీసాలతో దాడులు చేసుకోవడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి..ఈ ఘటన తండాలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కౌడిపల్లి మండలం హరిచంద్ తండాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తండాకు చెందిన రాందాస్ నరేందర్, దాసురు స్వరూప, రవీ, రెడ్యా వర్గానికి.. అదే తండాకు చెందిన లక్ష్మణ్, గణేష్, కవిత, రూంసి, రాహుల్, దశరథ్, కంసి, రవీందర్ వర్గానికి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి..పాత కక్షలను మనసులో పెట్టుకున్న ఇరు వర్గాలు ఆదివారం మరోసారి వాగ్వాదానికి దిగాయి..ఇది కాస్తా ముదిరి పరస్పర దాడులకు దారితీసింది.

ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఇనుప రాడ్లు, ఖాళీ సీసాలతో విచక్షణా రహితంగా దాడి చేసుకున్నారు. గొడవ అంతటితో ఆగకుండా.. రోడ్లపై ఉన్న వాహనాలు, పశువుల కొట్టాలు, ఇళ్లపై కూడా దాడి చేసి ధ్వంసం చేశారు..ఈ భీకర దాడిలో ఇరు వర్గాలకు చెందిన పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.. బాధితులను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న నర్సాపూర్ సీఐ జాన్ రెడ్డి, కౌడిపల్లి ఎస్సై అమరేందర్ రెడ్డి హుటాహుటిన తండాకు చేరుకున్నారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించి, బాధితుల నుంచి వివరాలు సేకరించారు..ప్రస్తుతం కౌడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షలే ఈ గొడవకు ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు..తండాలో మళ్లీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు నిఘా పెట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *