
దేశంలో పెరుగుతున్న డిజిటల్ మోసాలను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక చర్యలకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా UPI, IMPS వంటి తక్షణ చెల్లింపు విధానాల ద్వారా పెద్ద మొత్తాల బదిలీలపై నియంత్రణలు తీసుకురావాలని ప్రతిపాదిస్తోంది. ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం రూ.10,000కు పైబడిన లావాదేవీలకు కూలింగ్-ఆఫ్ పీరియడ్ అమలు చేసే అవకాశం ఉంది.
ఈ ప్రతిపాదన ప్రకారం రూ.10,000 కంటే ఎక్కువ మొత్తాన్ని పంపినప్పుడు, ఆ డబ్బు గ్రహీత ఖాతాలోకి చేరడానికి ఒక గంట వరకు ఆలస్యం కావచ్చు. ఈ వ్యవధిలో పంపిన వ్యక్తికి లావాదేవీని పరిశీలించే అవకాశం లభిస్తుంది. మోసం జరిగిందని అనుమానం కలిగితే, ఆ ట్రాన్సాక్షన్ను రద్దు చేసుకునే వీలును కూడా కల్పించనున్నారు. RBI అంచనాల ప్రకారం 2026 నాటికి దేశంలో ఆన్లైన్ మోసాల మొత్తం విలువ రూ.22,000 కోట్లను దాటే అవకాశం ఉంది. ముఖ్యంగా సోషల్ ఇంజనీరింగ్ ద్వారా జరిగే మోసాలు పెరుగుతున్నాయని బ్యాంక్ గుర్తించింది. మోసగాళ్లు బాధితులను బెదిరించడం లేదా నచ్చచెప్పడం ద్వారా వెంటనే డబ్బు పంపేలా ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక గంట గడువు ఇవ్వడం వల్ల వినియోగదారులకు ఆలోచించేందుకు సమయం దొరుకుతుందని భావిస్తున్నారు.
అయితే ఈ నియమం అందరికీ వర్తించదు. వినియోగదారులు తమకు నమ్మకమైన వ్యక్తులను వైట్లిస్ట్ చేసుకుంటే, వారికి డబ్బు పంపేటప్పుడు ఎలాంటి ఆలస్యం ఉండదు. అలాగే వ్యాపార చెల్లింపులు, ఇ-మాండేట్లు, చెక్కులు, NACH లావాదేవీలు ఈ నియమానికి మినహాయింపుగా ఉంటాయి. ఇంకా 70 ఏళ్లు పైబడిన వారు రూ.50,000 కంటే ఎక్కువ మొత్తాన్ని బదిలీ చేయాలంటే విశ్వసనీయ వ్యక్తి అనుమతి తప్పనిసరి చేయాలని ప్రతిపాదించారు. అలాగే వ్యక్తిగత, చిన్న వ్యాపార ఖాతాలలో రూ.25 లక్షలు దాటిన డిపాజిట్లకు అదనపు ధృవీకరణ అవసరం ఉంటుంది. ఇవే కాకుండా వినియోగదారులు తమ అన్ని డిజిటల్ చెల్లింపు సదుపాయాలను ఒకేసారి నిలిపివేయగల కిల్ స్విచ్ వ్యవస్థను కూడా RBI పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదనపై మే 8, 2026 వరకు ప్రజల నుంచి సూచనలు స్వీకరించి, ఆ తరువాత తుది మార్గదర్శకాలను ప్రకటించే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
