
చంద్రుడిపైకి మానవులను తీసుకెళ్లే దిశగా కీలక అడుగుగా భావిస్తున్న ఆర్టెమిస్ II మిషన్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే ఒక సాంకేతిక సమస్య ఎదురైంది. నాసా ఆధ్వర్యంలో ఏప్రిల్ 1న విజయవంతంగా ప్రయోగించిన ఈ మిషన్లో నలుగురు వ్యోమగాములు చంద్రుని చుట్టూ 10 రోజుల ప్రయాణానికి బయలుదేరారు. అయితే అంతరిక్ష నౌకలో ఎలాంటి యాంత్రిక లోపాలు లేకపోయినా, సాధారణంగా ఉపయోగించే సాఫ్ట్వేర్ సమస్య సిబ్బందిని ఆశ్చర్యానికి గురిచేసింది.
మిషన్ కమాండర్ రీడ్ వైస్మాన్, భూమి కక్ష్యలోకి ప్రవేశించిన కొన్ని గంటల తర్వాత, అంతరిక్ష నౌకలోని వ్యక్తిగత కంప్యూటింగ్ పరికరాల్లో మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ పనిచేయడం లేదని గుర్తించారు. ఆయన ఉపయోగించిన పరికరం మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రో అని సమాచారం. ఒకేసారి రెండు అవుట్లుక్ అప్లికేషన్లు స్పందించకపోవడంతో, ఆయన హ్యూస్టన్లోని మిషన్ కంట్రోల్ను సంప్రదించి రిమోట్ సహాయం కోరారు. తదుపరి భూమిపై ఉన్న ఇంజినీర్లు పరికరాన్ని రిమోట్గా యాక్సెస్ చేసి సమస్యను పరిష్కరించారు. మిషన్ కంట్రోల్ ప్రకారం అవుట్లుక్ తిరిగి పనిచేయడం ప్రారంభించినప్పటికీ, అది ఆఫ్లైన్ మోడ్లోనే ఉన్నట్లు తెలిపారు.
అంతరిక్షంలో ఈమెయిల్ వ్యవస్థ వినియోగం అవసరం ఏమిటన్నది స్పష్టంగా తెలియకపోయినా, కమ్యూనికేషన్ కోసం బ్యాకప్ టూల్గా ఉపయోగించే అవకాశముందని భావిస్తున్నారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. సాధారణంగా భూమిపై ఎదురయ్యే సాఫ్ట్వేర్ సమస్యలు అంతరిక్షంలో కూడా తప్పించుకోలేమని వినియోగదారులు వ్యాఖ్యానించారు. ప్రముఖ వెబ్సిరీస్ స్పేస్ ఫోర్స్లో చూపించిన విండోస్ అప్డేట్ సమస్యలతో దీనిని పోలుస్తూ మీమ్స్ వైరల్ అయ్యాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న అంతరిక్ష మిషన్లలో కూడా సాధారణ సాఫ్ట్వేర్ లోపాలు చోటుచేసుకోవచ్చని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
