
అస్సాంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ని సోనిత్పూర్ జిల్లాలో ఆదివారం (మార్చి 22) రాత్రి అంబులెన్స్, ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, వారికి చికిత్స అందిస్తున్నారు. ధేకియాజులి పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి 15 (NH-15)పై ఈ ప్రమాదం జరిగింది. ఒక రోగిని, అతని కుటుంబ సభ్యులను తేజ్పూర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (TMCH)కు తీసుకువెళ్తున్న అంబులెన్స్, ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఆ ధాటికి అంబులెన్స్ ముందు భాగం పూర్తిగా ధ్వంసమైందని పోలీసులు తెలిపారు.
సోనిత్పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బరున్ పుర్కాయస్థ ఈ ఘటనను ధృవీకరిస్తూ, ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారని తెలిపారు. మృతులలో రోగి, అతని కుటుంబ సభ్యులు, అంబులెన్స్ సిబ్బంది ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని స్థానికులు, పోలీసుల సహాయంతో వెంటనే తేజ్పూర్ మెడికల్ కాలేజీలో చేర్పించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది.
ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే, పోలీసులు, అత్యవసర సేవల సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. రోడ్డుపై నుండి దెబ్బతిన్న వాహనాలను తొలగించి, వాటిలో చిక్కుకున్న వారిని రక్షించడానికి చాలా శ్రమ పడాల్సి వచ్చింది. ప్రమాదం తర్వాత జాతీయ రహదారిపై ట్రాఫిక్కు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. పోలీసులు దానిని పునరుద్ధరించారు. ప్రాథమికంగా అతివేగం ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. మరేదైనా సాంకేతిక కారణం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
