
అమరావతి, మార్చి 16: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్లకు సోమవారం (మార్చి 16) నుంచి ఒంటి పూట బడులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఉదయం 7.45 గంటలకే విద్యార్ధులు బడులకు వెళ్లి మధ్యాహ్నం 12.30 గంటలకు తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు. అటు తెలంగాణలోనూ ఈ రోజు నుంచి ఒంటి పూట బడులు మొదలయ్యాయి. ఏప్రిల్ 23వ తేదీ వరకు ఇదే మాదిరి ఒంటి పూట స్కూళ్లు కొనసాగుతాయి. ఆ తర్వాత ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు వస్తాయి. అయితే విద్యార్ధులకు మార్చి నెలలోనూ వరుస సెలవులు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ వారంలో ఉగాది మొదలు వరుసగా సెలవులు వస్తున్నాయి.
మార్చి 19న ఉగాది, మార్చి 20న జమత్ ఉల్ విద, ఆ తర్వాత మార్చి 21న రంజాన్ పండుగలు రానున్నాయి. ఆ తర్వాత మార్చి 22వ తేదీన ఆదివారం వస్తుంది. దీంతో గురువారం నుంచి ఆదివారం వరకు వరుస సెలవులు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వరుసగా 4 రోజులు సెలవులు వస్తున్నాయి. ఇవి కాకుండా మార్చి 26న శ్రీరామనవమి, మార్చి 31న మహవీర్ జయంతి ఉన్నాయి. మాకంయి 28న ఆదివారంతో కలిపి ఈ నెలాకరు నాటికి మొత్తంగా 6 రోజులు సెలవులు వస్తున్నాయి.
ఈ క్రమంలో విద్యార్ధుల తల్లిదండ్రులు, ఉద్యోగులు వరుస సెలవులకు ప్రయాణాలు ప్లాన్ చేస్తున్నారు. కొందరు సొంతూళ్లకు వెళ్లేందుకు ముందుగానే ఆర్టీసీ, రైల్వేలో రిజర్వేషన్ చేసుకుంటున్నారు. ఉగాది పండుగ సెలవుల నేపథ్యంలో ప్రత్యేక బస్సులను నడపాలని తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ యాజమాన్యాలు ఇప్పటికే నిర్ణయించాయి. ప్రధానంగా మార్చి 17, 18 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆయా రోజుల్లో రద్దీ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. 4 రోజుల సెలవుల అనంతరం మార్చి 23వ తేదీన తిరుగు ప్రయాణం నేపథ్యంలోనూ రద్దీకి అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక పండగ రోజుల్లో ఉచిత బస్సు పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం యథావిధిగా అమల్లో ఉంటుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.
