
దేశ రాజకీయాలను నిశితంగా గమనించే వారికి.. అసలు రాజకీయాలు తెలియని వారికి కూడా ఒక్క విషయంలో క్లారిటీ ఉంది.. అదే ఉచిత పథకాలు ఈ దేశంలో మొదలైంది మొట్ట మొదటగా తమిళనాడులో అని.. 1978లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత ఎంజీఆర్ మొదలు పెట్టిన పథకాలు.. మధ్యాహ్న భోజనం.. రేషన్ బియ్యం.. అప్పట్లో వాటి అవసరం చాలనే ఉండేది. ఆతర్వాత చాలా గ్యాప్ తర్వాత 2006 లో డీఎంకే ఉచిత కలర్ టీవీలతో మొదలు పెట్టింది. ఆతర్వాత జయలలిత సీఎం అయ్యాక ఉచిత మిక్సీలు, ఫ్యాన్ లు గ్రైండర్లు.. అలా ఇప్పటికీ ఆ ఉచితాల జోరు మామూలుగా లేదు. అసలు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం అమలవుతున్న చాలా పథకాలు తమిళనాడులో మొదలైనవే. ఇప్పటిదాకా తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే.. మార్చి మార్చి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ వస్తున్నాయి. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఈ రెండు పార్టీలు ఉచిత పథకాల ప్రకటనలో ఏమాత్రం తగ్గడం లేదు..
ఇవి చాలా తన్నట్టు తాగాక నటుడు విజయ్ స్థాపించిన టీవీకే కూడా తోడైంది. ఈ ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు ఉచిత పథకాల ప్రకటన జోరు చూస్తుంటే ప్రజలకు ఇచ్చే పథకాలకు ఆ మూడు పార్టీలు వేలం పాట పాడుతున్నట్టు అనిపిస్తోంది. అర్హత ఉన్న మహిళలకు నెలకి వెయ్యి రూపాయలు ఇస్తోంది డీఎంకే ప్రభుత్వం. అదే పథకాన్ని తాము అధికారంలోకి వస్తే రెండు వేల రూపాయలు ఇస్తామని అన్నాడీఎంకే చెప్పింది. అన్నాడీఎంకే ప్రకటనతో డీఎంకే రూ.2 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇక విజయ్ మరో అడుగు ముందుకు వేసి 2500 ఇస్తానన్నారు. రాష్ట్రంలో పెన్షన్ 1200 ఉండగా అన్నాడీఎంకే 2000 ఇస్తామని ప్రకటన చేసింది.
ఉచిత బస్సు ప్రయాణం
డీఎంకే మహిళలకు మాత్రమే.. జిల్లాల వారీగా ఈ పథకాన్ని అమలు చేస్తుండగా అన్నాడీఎంకే పురుషులకు కూడా పథకాన్ని అమలు చేస్తామని చెప్పింది. విజయ్ మహిళలకు రాష్టం మొత్తం మీద అన్ని బస్సుల్లో ఫ్రీ చేస్తామన్నారు. ఆర్థికంగా మెరుగు పడడానికి రూ.10వేలు ఇస్తామని ఏడీఎంకే, రూ.15 వేలు ఇస్తామని టీవీకే ప్రకటన చేసింది. ఏడీఎంకే ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పగా విజయ్ ఏడాదికి ఆరు సిలిండర్లు ఇస్తామని చెప్పారు. అలాగే విజయ్ ఐదు ఎకరాలలోపు ఉన్న రైతులకు మొత్తం రుణ మాఫీ.. అంతకంటే ఎక్కువ ఉన్న రైతులకు 50 శాతం మాఫీ చేస్తానని ప్రకటించారు.
విజయ్ మరో పథకం.. పెళ్లి చేసుకునే వధువుకు పట్టుబట్టలు.. 8 గ్రాముల బంగారం. తమిళనాడులో పుట్టిన పిల్లలకు బంగారు ఉంగరం కూడా విజయ్ హామీల్లో ఒకటి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫీజ్ రీయింబర్స్ తరహాలో అన్నా డీఎంకే విద్యార్థుల ఫీజులు నేరుగా ప్రభుత్వమే చెల్లించే పథకం ప్రకటించింది. అన్నా డీఎంకే చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్.. జల్లికట్టు కమిటీలకు 5 లక్షల సాయం, జల్లికట్టులో మృతులకు 10 లక్షలు.. గాయపడ్డ వారికి 2 లక్షలు ఇస్తామని ప్రకటించింది. ఇక డీఎంకే పూర్తి స్థాయి మానిఫెస్టో ఇంకా ప్రకటించలేదు. కనిమొళి ఆధ్వర్యంలో మైనిఫెస్టో సిద్ధం అవుతుందన్న డీఎంకే త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది. అయితే అన్నాడీఎంకే సహా ఇతర పార్టీలు తమ పథకాలను కాపీ కొట్టి టాప్అప్ చేస్తున్నారని సీఎం స్టాలిన్ ఆరోపించారు.
