
విజయనగరం జిల్లాలోని బొండపల్లి మండలంలో అర్థరాత్రి జరిగిన కొన్ని భయానక దృశ్యాలు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. శేరిచెరువు గట్టుపై గుర్తు తెలియని వ్యక్తులు నిర్వహించిన క్షుద్రపూజలు ఇప్పుడు గ్రామమంతటా చర్చనీయాంశంగా మారాయి. తెల్లవారుజామున అటుగా వెళ్లిన గ్రామస్తులు అక్కడ ఉన్న దృశ్యాలను చూసి ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. చెరువు గట్టుపై తెల్లని ముగ్గులు వేసి, పసుపు, కుంకుమలు చల్లి ఉన్నాయి. పూజల మధ్యలో ఒక చెక్క బొమ్మను ఉంచి, దాని చుట్టూ వింత ఆకృతులను గీశారు. మరీ ముఖ్యంగా, రెండు నల్ల కోళ్లను బలి ఇచ్చి, ఆ రక్తాన్ని పూజా స్థలమంతా చల్లడం చూస్తుంటే ఇవి కచ్చితంగా క్షుద్రపూజలేనని స్థానికులు బలంగా నమ్ముతున్నారు. పూజా సామగ్రి అంతా అక్కడే చెల్లాచెదురుగా పడి ఉండటం గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల జరిగిన చంద్ర గ్రహణాన్ని పురస్కరించుకుని, గిట్టని వారిపై లేదా శత్రువులపై హాని తలపెట్టేందుకే కొందరు తాంత్రికులు ఈ పనులు చేసి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో రాత్రి వేళల్లో బయటకు రావాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఇలాంటి మూఢనమ్మకాలు గ్రామాల్లో అశాంతిని కలిగిస్తున్నాయని, వెంటనే పోలీసులు స్పందించి ఈ క్షుద్రపూజలు చేసింది ఎవరో తేల్చాలని స్థానికులు కోరుతున్నారు. అసలు ఆ పూజలు ఎవరిని ఉద్దేశించి చేశారు? దీని వెనుక ఉన్నదెవరు? అనే ప్రశ్నలు ఇప్పుడు బొండపల్లిలో ఉత్కంఠ రేపుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అద్భుతం.. మూగజీవికి పునర్జన్మ.. ప్రాణం నిలిపిన సీపీఆర్
