తాజావార్తలు

మళ్లీ పెరిగిన CNG ధరలు..! కిలోకు ఎంత పెరిగిందంటే..?


ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ ప్రాంతాల్లో సీఎన్‌జీ వినియోగదారులకు మరోసారి షాక్ తగిలింది. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (ఐజీఎల్) సీఎన్‌జీ ధరలను కిలోకు రూ.3.89 పెంచింది. శనివారం ఉదయం 6 గంటల నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎల్‌ఎన్‌జీ ధరలు పెరగడం, ఇన్‌పుట్ గ్యాస్ ఖర్చులు అధికం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐజీఎల్ వెల్లడించింది.

ఐదోసారి ధరల పెంపు

ఈ ఏడాదిలో సీఎన్‌జీ ధరలను పెంచడం ఇది ఐదోసారి. మే నెలలో కేవలం పది రోజుల వ్యవధిలో నాలుగు దశల్లో మొత్తం కిలోకు ₹6 చొప్పున ధరలు పెంచిన ఐజీఎల్.. తాజాగా మరోసారి ధరలను పెంచింది. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ ఇంధన మార్కెట్లలో ఎల్‌ఎన్‌జీ ధరలు గణనీయంగా పెరిగాయని కంపెనీ తెలిపింది.

ఏ నగరంలో ఎంత ధర?

తాజా పెంపు తర్వాత నోయిడా, ఘజియాబాద్‌లో సీఎన్‌జీ ధర కిలోకు రూ.95.59కి చేరింది. మీరట్‌లో రూ.95.47, గురుగ్రామ్‌లో రూ.92.01గా ఉంది. ఢిల్లీలోనూ కొత్త ధరలు శనివారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి. రాష్ట్రాల వారీగా వేర్వేరు వ్యాట్‌ రేట్లు ఉండటంతో సీఎన్‌జీ ధరల్లో కూడా తేడాలు కనిపిస్తాయి. సీఎన్‌జీ తయారీలో ఉపయోగించే గ్యాస్‌లో అధిక భాగం దిగుమతి చేసుకున్న ఎల్‌ఎన్‌జీ నుంచే వస్తుందని ఐజీఎల్ పేర్కొంది. పశ్చిమ ఆసియా సంఘర్షణల కారణంగా స్పాట్, కరెంట్ మార్కెట్లలో ఎల్‌ఎన్‌జీ ధరలు పెరిగాయి. హోర్ముజ్ జలసంధి ద్వారా ఇంధన రవాణాపై ఏర్పడిన అనిశ్చితి కూడా అంతర్జాతీయ ధరలపై ప్రభావం చూపుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ఆటోలు, ట్యాక్సీలపై భారం

సీఎన్‌జీ ధరలు పెరగడంతో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఆటోరిక్షాలు, ట్యాక్సీలు, సరుకు రవాణా వాహనాల నిర్వహణ ఖర్చులు మరింత పెరగనున్నాయి. దీంతో భవిష్యత్‌లో ప్రయాణికుల ఛార్జీలు, సరుకు రవాణా రేట్లపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. చలికాలం సమీపిస్తుండటంతో యూరప్ పెద్ద మొత్తంలో ఎల్‌ఎన్‌జీని నిల్వ చేసుకుంటోంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ పెరిగి ధరలు కూడా పైకి కదులుతున్నాయి. ఆసియా జెకెఎం, యూరోపియన్ టిటీఎఫ్‌ గ్యాస్ బెంచ్‌మార్క్‌లు గత నెలల్లో గణనీయంగా పెరిగాయి. ఈ పరిణామాల ప్రభావం భారత సీఎన్‌జీ ధరలపైనా పడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *