నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన యాత్రికులు పలువురు చిక్కుకుపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే ఘటనపై స్పందించి యాత్రికులపై రక్షణ చర్యలపై హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలను వేగవంతం చేసేలా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఆర్టీజిఎస్ -విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు నేపాల్లోని భారత రాయబార కార్యాలయం, స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ యాత్రికుల భద్రతను పర్యవేక్షిస్తున్న తీరును మంత్రి అడిగి తెలుసుకున్నారు.
బాధితుల కుటుంబ సభ్యులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, నేపాల్ అధికారులు, సంబంధిత వర్గాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ యాత్రికులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని తగిన చర్యలు తీసుకుంటోందని మంత్రి అనిత స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రత్యేక హెల్ప్లైన్లను కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
ఈ సందర్భంగా బాధితులకు అవసరమైన సహాయం అందించేందుకు, వారి స్థితిగతులను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA), ఆర్టీజీఎస్ (RTGS)తో కలిసి సమన్వయంతో చర్యలు చేపట్టిందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. వరదల్లో చిక్కుకున్న యాత్రికుల సమాచారం, వారి సహాయార్థం బాధితుల బంధువులు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112,1070, 1800 425 0101 సంప్రదించవచ్చని ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,
