తాజావార్తలు

కారుకు అడ్డమొచ్చారని దారుణం.. యూటర్న్ తీసుకుని మరీ కారుతో తొక్కించి తండ్రిని చంపిన ఉన్మాది!

కారుకు అడ్డమొచ్చారని దారుణం.. యూటర్న్ తీసుకుని మరీ కారుతో తొక్కించి తండ్రిని చంపిన ఉన్మాది!


కారుకు అడ్డమొచ్చారని దారుణం.. యూటర్న్ తీసుకుని మరీ కారుతో తొక్కించి తండ్రిని చంపిన ఉన్మాది!

రోడ్డుపై నిలబడ్డారనే ఒక చిన్న వివాదం, ఒకరి ప్రాణం తీసేవరకు వెళ్లింది. కారుకు అడ్డంగా ఉన్నావంటూ మొదలైన వాగ్వాదం.. చివరకు దారుణ హత్యకు దారితీసింది. పగతో రగిలిపోయిన ఓ ఉన్మాది, యూటర్న్ తీసుకుని మరీ కారుతో తండ్రీకొడుకులను తొక్కించాడు. ఈ దారుణ ఘటనలో తండ్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, కుమారుడు తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

కంది మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో అర్ధరాత్రి వేళ ఈ రక్తపాతం సృష్టించారు. ఆంజనేయులు అనే వ్యక్తి రాత్రి సమయంలో కారులో వెళ్తుండగా, స్థానికంగా ఉండే రమేష్ కుమారుడు శ్రవణ్ తో కలిసి రోడ్డుపై నిలబడి ఉన్నాడు. “రోడ్డుపై అడ్డంగా ఉంటే కారు ఎలా వెళ్తుంది?” అంటూ ఆంజనేయులు శ్రవణ్‌తో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాట మాట పెరిగి వివాదం పెద్దదవుతుండటంతో, శ్రవణ్ తండ్రి రమేష్ అక్కడికి చేరుకున్నాడు. గొడవను సద్దుమణిగించేందుకు, ఆంజనేయులుకు నచ్చజెప్పేందుకు రమేష్ తీవ్రంగా ప్రయత్నించాడు.

కానీ, అప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్న ఆంజనేయులు.. రమేష్ మాటలను పట్టించుకోలేదు. అక్కడి నుంచి కారును ముందుకు తీసుకెళ్లిన అతడు, మనసులో పగ పెంచుకున్నాడు. క్షణాల వ్యవధిలోనే కారును యూటర్న్ తీసుకుని, నేరుగా రమేష్, శ్రవణ్‌లపైకి వేగంగా దూసుకొచ్చాడు. కారు వేగాన్ని గమనించిన శ్రవణ్ చాకచక్యంగా పక్కకు తప్పించుకుని ప్రాణాలు కాపాడుకోగా, తండ్రి రమేష్‌ను కారు బలంగా ఢీకొట్టింది. కారును రమేష్ పైనుంచి పోనివ్వడంతో ఆయన అక్కడికక్కడే రక్తపు మడుగులో ప్రాణాలు విడిచారు. అంతటితో ఆగని ఉన్మాది.. పక్కనే ఉన్న కిరాణా షాపును కూడా ఢీకొట్టి, అక్కడి నుంచి కారుతో పరారయ్యాడు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. నిందితుడు ఆంజనేయులు గురించి ఆరా తీయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడిపై గతంలోనే హత్యాయత్నం కేసులతో పాటు, గంజాయి సరఫరా కేసులు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పక్కా ప్లాన్‌తోనే రమేష్‌ను కారుతో తొక్కి చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *