Vaibhav Sooryavanshi : టీమిండియా అప్కమింగ్ సిరీస్ల వేళ బీసీసీఐ ఒక అపూర్వమైన నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత సీనియర్ జాతీయ జట్టుకు ఎంపికై ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ విషయంలో బోర్డు మానవత్వంతో స్పందించింది. త్వరలోనే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు వెళ్లనున్న వైభవ్తో పాటు అతడి తల్లిదండ్రులు కూడా ప్రయాణించేందుకు బీసీసీఐ స్పెషల్ పర్మిషన్ ఇచ్చింది. సాధారణంగా అంతర్జాతీయ పర్యటనల్లో ఆటగాళ్ల కుటుంబ సభ్యులను అధికారికంగా వెంట తీసుకెళ్లడంపై కఠినమైన రూల్స్ ఉంటాయి. కానీ, వైభవ్ చిన్న వయసును పరిగణనలోకి తీసుకుని బోర్డు ఈ ప్రోటోకాల్ను బ్రేక్ చేసింది.
లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాటర్ అయిన వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్న ట్రై సిరీస్లో ఇండియా-ఏ జట్టు తరపున ఆడుతున్నాడు. ఈ టోర్నీ ముగిసిన వెంటనే అతడు ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలతో పాటు 2026 ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత ప్రధాన జట్టుతో కలవనున్నాడు. అయితే, జాతీయ జట్టులోని మిగిలిన ఆటగాళ్లంతా వయసులో, అనుభవంలో చాలా పెద్దవారు కావడంతో.. 15 ఏళ్ల వైభవ్ ఆ నయా వాతావరణంలో ఒంటరితనానికి గురికాకూడదని, సీనియర్ల డ్రెస్సింగ్ రూమ్ భయం పోగొట్టుకోవాలని బోర్డు భావించింది. అందుకోసమే తల్లిదండ్రుల తోడు అవసరమని ఈ అరుదైన భరోసా ఇచ్చింది.
ఈ చారిత్రాత్మక నిర్ణయం వెనుక ఉన్న బలమైన కారణాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మీడియా ముందు వెల్లడించారు. 1989లో కేవలం 16 ఏళ్ల ప్రాయంలోనే అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన గాడ్ ఆఫ్ క్రికెట్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తొలి రోజులను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అంతటి అద్భుత టాలెంట్ ఉన్న ప్లేయర్ మన దేశానికి దొరికాడని కొనియాడారు. పెద్ద పెద్ద ఆటగాళ్ల మధ్య ఒక చిన్న పిల్లాడు మానసిక ఒత్తిడికి లోనవకుండా ప్రశాంతంగా ఉండేందుకు తల్లిదండ్రుల సమక్షం ఎంతో ప్లస్ అవుతుందని బోర్డు నమ్ముతోంది.
ప్రస్తుత శ్రీలంక పర్యటనలో వైభవ్ ఆశించిన స్థాయిలో పరుగుల వరద పారించనప్పటికీ (నాలుగు ఇన్నింగ్స్ల్లో 117 పరుగులు), లంక ఆటగాళ్లతో మైదానంలో జరిగిన కొన్ని వాడివేడి వాగ్వాదాలు, స్లెడ్జింగ్ ఘటనలు హైలైట్ అయ్యాయి. అంతర్జాతీయ క్రికెట్లో ఇలాంటి మైండ్ గేమ్స్ సర్వసాధారణం అయినప్పటికీ, 15 ఏళ్ల వయసులో వాటిని తట్టుకోవడం కష్టం. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఒక చిన్నారికి కుటుంబ సభ్యుల లవ్ అండ్ సపోర్ట్ ఎంతో అవసరమని బీసీసీఐ గ్రహించింది. గ్రౌండ్ బయట అతడికి ఎలాంటి ఆందోళన లేని ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే తమ బాధ్యతని సైకియా స్పష్టం చేశారు. కేవలం ఆటపైనే పూర్తి ఫోకస్ పెట్టాలని బోర్డు వైభవ్కు సూచించింది.
