పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంధన ఎగుమతులపై విధిస్తున్న విండ్ ఫాల్ ట్యాక్స్ను మరోసారి పెంచింది. పెట్రోల్పై మాత్రం విండ్ ఫాల్ ట్యాక్స్ను యధాతధంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రతీ 15 రోజులకు ఒకసారి విండ్ ఫాల్ ట్యాక్స్ను కేంద్రం సవరిస్తూ వస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు మరోసారి సవరణలు చేసింది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల క్రమంలో కేంద్రం విండ్ ఫాల్ ట్యాక్స్ విధానాన్ని తీసుకొచ్చింది. తొలుత కొంతమేర పెంచగా.. ఆ తర్వాత తగ్గించింది. ఇప్పుడు మరోసారి పెంచింది. ఇప్పుడు డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ప్యూయెల్పై మరోసారి పెంచింది.
జులై 1న మరోసారి నిర్ణయం..
గతంలో డీజిల్పై ఎగుమతి సుంకం లీటర్పై రూ.13.50గా ఉంది. అయితే ఇప్పుడు పెరగడంతో రూ.15కి చేరుకుంది. ఇక ఏటీఎఫ్పై గతంలో లీటర్పై రూ.9.50గా ఉండేది. కానీ ఇప్పుడు రూ.12.5కి చేరుకుంది. అంటే లీటర్పై రూ.3 మేర కేంద్రం పెంచింది. ఇక పెట్రోల్పై ఎగుమతి సుంకం లీటర్పై రూ.1.50గా ఉంది. కొత్త రేట్లు జూన్ 16వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. జులై 1న మరోసారి వీటిల్లో సవరణలు చేసే అవకాశముందని తెలుస్తోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలకు అనుగుణంగా విండ్ ఫాల్ ట్యాక్స్లో కేంద్రం మార్పులు చేస్తూ వస్తోంది. ఇటీవల ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి. గతంలో బ్యారెల్ 120 డాలర్లపైకి చేరుకోగా.. ఇప్పుడు 80 డాలర్లకు పడిపోయాయి. దీంతో కేంద్రం సవరణలకు శ్రీకారం చుట్టింది.
మరోసారి పెంపు ఎందుకు..?
రష్యా-ఉక్రెయిన్ క్రమంలో తొలిసారి కేంద్రం విడ్ ఫాల్ ట్యాక్స్ విధానాన్ని తీసుకొచ్చింది. అప్పట్లో యుద్ద సమయంలో వీటిల్లో మార్పులు చేసింది. యుద్ద సమయంలో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరగడంతో దేశీయ సంస్థలు ఇంధనాన్ని విదేశాలకు ఎగుమతి చేసి భారీగా లాభాలను సొమ్ము చేసుకున్నాయి. దీని వల్ల దేశంలో ఇంధన వినియోగం అనేది తగ్గిపోతుంది. ఈ క్రమంలో ఎగుమతులపై విండ్ ఫాల్ ట్యాక్స్ విధానాన్ని కేంద్రం అప్పట్లో ప్రవేశపెట్టింది. ఆ తర్వాత యుద్ద పరిస్థితులు తగ్గాక 2024 చివరిలో కేంద్రం విండ్ ఫాల్ ట్యాక్స్ విధానాన్ని తొలగించింది. అయితే ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం వల్ల మళ్లీ క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో ఈ ట్యాక్స్ విధానాన్ని మార్చిలో ప్రవేశపెట్టింది. అప్పటివరకు ప్రతీ 15 రోజులకు ఒకసారి మారుస్తూ వస్తోంది. అయితే ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నాయి. అయితే కేంద్రం ఎగుమతి సుంకాన్ని పెంచడం చర్చనీయాంశంగా మారింది.
