
తిరుపతి, ఏప్రిల్ 15: తిరుమల శ్రీవారి దర్శనాలకు వచ్చే భక్తులకు వసతి పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్ అయింది. శ్రీవారి బ్రేక్ దర్శనాలతో పాటు తిరుమలలో ఏసీ, నాన్ ఏసీ గదులు తీసిస్తామని సోషల్ మీడియాలో ప్రచారం చేసిన ఇద్దరు కేటుగాళ్ళ దందాకు పోలీసులు చెక్ పెట్టారు. శ్రీవారి దర్శనం పేరుతో దాదాపు 100 మందినిపైగా మోసగించిన చిత్తూరు జిల్లా పెనుమూరుకు చెందిన పవన్ కుమార్ రెడ్డి, చెన్నకేశవ రెడ్డిలను అరెస్ట్ చేసారు. శ్రవణ్ కళ తిరుమల తిరుపతి దేవస్థానం అనే పేరుతో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ పేజీలను క్రియేట్ చేసి మోసాలు పాల్పడినట్లు గుర్తించారు.
రెండేళ్లుగా భక్తులను మోసగిస్తూ అందిన కాడికి దోచుకున్న ముఠా చేతిలో మోసపోయిన భక్తులు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక. కేరళ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. భక్తుల నుంచి అందిన ఫిర్యాదులతో కేసు నమోదు చేసిన తిరుమల టూ టౌన్ పోలీసులు ఇద్దర్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. 2022లోనే పవన్ కుమార్ రెడ్డిపై తిరుమల టూ టౌన్ పిఎస్ లో కేసు నమోదు కాగా.. అప్పటి నుంచి దొరక్కుండా భక్తులను మోసగిస్తున్న ముఠా ఎట్టకేలకు పట్టుబడింది. ఫేక్ వెబ్ సైట్లు, దళారీల చేతిలో మోసపోవద్దని పోలీసులు చెబుతున్నారు. టీటీడీ అఫీషియల్ వెబ్ సైట్ నుంచి మాత్రమే దర్శన టికెట్లు, వసతి పొందాలని సూచిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
