
కోర్టులకు బాంబ్ బెదిరింపులు ఆగడం లేదు. హనుమకొండ అదాలత్ లోని వరంగల్ జిల్లా కోర్టులో టెన్షన్ వాతావారణం నెలకొంది. తాజాగా వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన కోర్టు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు, ఫైర్ సిబ్బందితో కలిసి కోర్టుకు చేరుకున్నారు. కోర్టు పరిసర ప్రాంతాలను బాంబు స్క్వాడ్ బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.
హనుమకొండ అదాలత్ లోని వరంగల్ జిల్లా కోర్టులో బాంబు పెట్టామని అజ్ఞాత వ్యక్తి మెయిల్ సందేశం పంపాడు. కోర్టు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన జిల్లా కోర్టు ప్రాంగణానికి చేరుకున్న బాంబ్స్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. దీంతో జిల్లా కోర్టులో కార్యకలాపాలు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. బాంబు బెదరింపుతో కోర్టు సిబ్బందితో పాటు న్యాయవాదులు, స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
అయితే రెండు గంటల పాటు జిల్లా కోర్టు ఆవరణలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించింది. చివరికి ఎలాంటి బాంబ్ లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బాంబు బెదిరింపుతో వచ్చిన ఫేక్ మెయిల్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాంబ్ బెదిరింపు మెయిల్ పంపిన వ్యక్తికోసం ఆరా తీస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
