వేసవి కాలం మొదలైందంటే చాలు.. భానుడి భగభగలకు తట్టుకోలేక అందరం చల్లటి నీటి కోసం వెతుకుతాం. ఈ క్రమంలో చాలామంది ఫ్రిజ్లో ఉంచిన ఐస్ వాటర్ తాగడానికి మొగ్గు చూపుతారు. అయితే ఫ్రిజ్ నీరు తాత్కాలికంగా ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ.. అది గొంతు నొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మన పూర్వీకులు అనుసరించిన మట్టి కుండ పద్ధతే వేసవికి అత్యంత సురక్షితమైన, ఆరోగ్యకరమైన మార్గమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మట్టి కుండ నీటిని తాగడం వల్ల కలిగే ఆ అద్భుత ప్రయోజనాలు:
సహజమైన ప్యూరిఫైయర్
మట్టి కుండ కేవలం నీటిని చల్లబరచడమే కాదు.. సహజంగా శుద్ధి చేస్తుంది. మట్టిలో ఉండే పోషకాలు నీటిలోని మలినాలను తొలగించి, శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతాయి. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
కడుపు సమస్యలకు చెక్
మనం తినే ఆహారం వల్ల శరీరంలో అసిడిటీ పెరుగుతుంది. మట్టి సహజంగా ఆల్కలైన్ గుణాన్ని కలిగి ఉంటుంది. మట్టి కుండలోని నీరు తాగడం వల్ల శరీరంలోని pH స్థాయి సమతుల్యంగా ఉంటుంది. దీనివల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యలు దూరమవుతాయి.
జీవక్రియను పెంచుతుంది
ప్లాస్టిక్ బాటిల్స్ లేదా ఫ్రిజ్ నీటిలో కెమికల్స్ ఉండే అవకాశం ఉంటుంది. కానీ మట్టి కుండ నీటిలో ఎటువంటి రసాయనాలు ఉండవు. ఈ నీటిలోని ఖనిజాలు జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా శరీర జీవక్రియను వేగవంతం చేస్తాయి.
వడదెబ్బ నుండి రక్షణ
వేసవిలో తీవ్రమైన వేడి వల్ల శరీరం త్వరగా డీహైడ్రేషన్కు గురవుతుంది. మట్టి కుండ నీటిలో ఉండే పోషకాలు, ఖనిజాలు శరీరాన్ని త్వరగా రీహైడ్రేట్ చేయడంలో సహాయపడతాయి. తద్వారా వడదెబ్బతగలకుండా రక్షిస్తాయి.
గొంతుకు సురక్షితం
ఫ్రిజ్ నీరు తాగితే గొంతు నొప్పి లేదా జలుబు చేసే అవకాశం ఉంది. కానీ మట్టి కుండ నీరు గొంతుకు చాలా మెత్తగా ఉంటుంది. శ్వాసకోస ఇబ్బందులు ఉన్నవారికి కూడా ఈ నీరు ఎంతో మేలు చేస్తుంది.
ఈ వేసవిలో కృత్రిమమైన చల్లదనం కంటే, ప్రకృతి సిద్ధమైన మట్టి కుండ నీటిని ఎంచుకోండి. ఇది కేవలం దాహాన్ని తీర్చడమే కాదు, మీ శరీరానికి అవసరమైన ఖనిజాలను అందించి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
