
దేశవ్యాప్తంగా రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గత నెల మార్చి 2026లో 22వ విడత విజయవంతంగా రైతుల ఖాతాల్లో జమ కావడంతో, ఇప్పుడు 23వ విడత కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి ప్రభుత్వం కొత్త నిబంధనను తప్పనిసరి చేయడంతో, తదుపరి విడత పొందేందుకు రైతులు అదనపు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పథకంలో పారదర్శకతను పెంచడం, అర్హులైన రైతులకు మాత్రమే నిధులు చేరేలా చూడడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘రైతు రిజిస్ట్రీ’ లేదా యూనిక్ ఫార్మర్ ఐడీని తప్పనిసరి చేసింది. ప్రస్తుతం ఈ నిబంధన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మొత్తం 14 రాష్ట్రాల్లో కఠినంగా అమలు అవుతోంది. ఇప్పటికే పథకం లబ్ధిదారులుగా ఉన్న రైతులు కూడా తమ తదుపరి వాయిదా నిరవధికంగా పొందాలంటే ఈ ఐడీని తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ యూనిక్ ఫార్మర్ ఐడీ ఒక డిజిటల్ గుర్తింపు కార్డు లాంటిది. ఇందులో రైతు భూమి వివరాలు, పంటల సమాచారం, ఎరువుల వినియోగం, పశుపోషణ, ఆదాయానికి సంబంధించిన కీలక వివరాలు నమోదు అవుతాయి. దీని ద్వారా భవిష్యత్తులో వివిధ ప్రభుత్వ పథకాల కోసం మళ్లీ మళ్లీ పత్రాలు సమర్పించే అవసరం తగ్గుతుంది. ఎరువుల సబ్సిడీలు, విత్తనాల సరఫరా, పంట బీమా క్లెయిమ్ వంటి సేవలను సులభంగా పొందే అవకాశం ఉంటుంది. రైతు ఐడీ నమోదు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో అందుబాటులో ఉంది. రైతులు తమ రాష్ట్ర అధికారిక ‘అగ్రిస్టాక్’ పోర్టల్ లేదా వ్యవసాయ శాఖ ద్వారా నమోదు చేసుకోవచ్చు. దీనికి ఆధార్ కార్డు, ఆధార్కు లింక్ అయిన మొబైల్ నంబర్, భూమి పత్రాలు అవసరం. అదనంగా ఇ-కేవైసీ పూర్తి చేయడం కూడా తప్పనిసరి.
పీఎం-కిసాన్ పథకం ప్రకారం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి విడత చెల్లింపులు జరుగుతాయి. ఈ క్రమంలో 23వ విడత 2026 జూన్ లేదా జూలైలో జమ అయ్యే అవకాశం ఉందని అంచనా. ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే, రైతులు ప్రభుత్వ హెల్ప్లైన్ నంబర్లను సంప్రదించి తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. మొత్తంగా కొత్త నిబంధనల ప్రకారం రైతులు సమయానికి రైతు ఐడీ నమోదు చేసుకోకపోతే, వచ్చే విడతలోని రూ.2,000 సహాయం కోల్పోయే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
