
IPL 2026 : ఐపీఎల్ అంటేనే భారీ సిక్సర్లు, హోరాహోరీ పోరాటాలు.. కానీ ఒక్కోసారి ప్రకృతి కన్నెర్ర చేస్తే మాత్రం అంతా తలకిందులవుతుంది. ఐపీఎల్ 2026 సీజన్లో కూడా అదే జరిగింది. సోమవారం (ఏప్రిల్ 6) కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ (KKR), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం ధాటికి రద్దయింది. మ్యాచ్ చూడటానికి వేల రూపాయలు పెట్టి టికెట్లు కొని స్టేడియానికి వచ్చిన అభిమానులకు ఇది తీరని నిరాశను మిగిల్చింది. అయితే, ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఒక్కటే.. మ్యాచ్ జరగలేదు కదా, మరి టికెట్ డబ్బులు వాపస్ వస్తాయా ?
కోల్కతాలో హోరాహోరీగా సాగుతుందనుకున్న ఈ మ్యాచ్పై వరుణుడు నీళ్లు జల్లాడు. మ్యాచ్ మొదలైన కొద్దిసేపటికే వర్షం దంచికొట్టింది. కేవలం 3.4 ఓవర్ల ఆట అంటే 22 బంతులు మాత్రమే పడ్డాయి. ఆ తర్వాత ఎంతసేపు వేచి చూసినా వాన తగ్గలేదు. రాత్రి 11 గంటల సమయంలో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అభిమానులు మైదానం నుంచి భారంగా వెనుదిరిగారు.
టికెట్ రిఫండ్ రూల్స్ ఏం చెబుతున్నాయి?
మ్యాచ్ చూడకుండానే వెనుదిరిగిన ఫ్యాన్స్కు ఇప్పుడు టికెట్ డబ్బుల టెన్షన్ పట్టుకుంది. కానీ, బీసీసీఐ నిబంధనలు వింటే వారికి గుండె ఆగినంత పనవుతుంది. ఐపీఎల్ నియమావళి ప్రకారం.. స్టేడియంలో ఒక్క బంతి పడినా, అంటే మ్యాచ్ అధికారికంగా మొదలైనట్లు లెక్క. అలా ఒక్క బంతి పడిన తర్వాత వర్షం వల్ల మ్యాచ్ రద్దయినా సరే, ప్రేక్షకులకు ఒక్క పైసా కూడా రిఫండ్ రాదు.
డబ్బులు ఎప్పుడు వెనక్కి వస్తాయి?
ఒకవేళ మ్యాచ్ మొదలవ్వక ముందే, అంటే ఒక్క బంతి కూడా పడకముందే వర్షం పడి మ్యాచ్ పూర్తిగా రద్దు అయితేనే ప్రేక్షకులకు టికెట్ డబ్బులు తిరిగి వస్తాయి. అది కూడా కేవలం టికెట్ ధర మాత్రమే రిఫండ్ అవుతుంది. ఆ టికెట్ కొనేటప్పుడు మనం చెల్లించిన జీఎస్టీ (GST) లేదా ఇతర బుకింగ్ ఛార్జీలు వెనక్కి రావు. కేవలం బేస్ ప్రైస్ మాత్రమే అకౌంట్లోకి వస్తుంది.
కోల్కతా-పంజాబ్ మ్యాచ్లో 22 బంతుల ఆట సాగింది. అంటే మ్యాచ్ మొదలైనట్టే. కాబట్టి ఇప్పుడు ఈడెన్ గార్డెన్స్కు వచ్చిన వేలాది మంది అభిమానులకు ఒక్క రూపాయి కూడా తిరిగి రాదు. వేల రూపాయలు ఖర్చు చేసి స్టేడియానికి వస్తే.. అటు ఇష్టమైన టీమ్ గెలవలేదు, ఇటు పెట్టిన సొమ్ము కూడా బూడిదలో పోసిన పన్నీరైందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
