దేశంలో పన్ను వ్యవస్థను మరింత పారదర్శకంగా, కట్టుదిట్టంగా మార్చే క్రమంలో కొత్త పాన్ కార్డు నిబంధనలను అమల్లోకి వచ్చాయి. 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చిన ఈ మార్పుల ప్రకారం, పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఇకపై కేవలం ఆధార్ కార్డు మాత్రమే సరిపోదు. అదనంగా వయస్సు, గుర్తింపును నిర్ధారించే పత్రాలను సమర్పించడం తప్పనిసరిగా మారింది.
కొత్త నిబంధనల ప్రకారం అభ్యర్థులు తమ గుర్తింపు, జనన తేదీని ధృవీకరించడానికి పలు పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుంది. వీటిలో జనన ధృవీకరణ పత్రం, ఓటర్ ఐడి కార్డు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, 10వ తరగతి మార్క్షీట్ లేదా మేజిస్ట్రేట్ జారీ చేసిన అఫిడవిట్ వంటి పత్రాలు ఉన్నాయి.
ఈ పత్రాలు సమర్పించడం ద్వారా దరఖాస్తుదారుల వివరాలు ఖచ్చితంగా నమోదు కావడంతో పాటు, నకిలీ లేదా డూప్లికేట్ పాన్ కార్డుల జారీని అరికట్టడమే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశ్యంగా అధికారులు తెలిపారు.
ఇక మరో ముఖ్యమైన మార్పు ఏమిటంటే పాన్ కార్డుపై ఉన్న పేరు ఇప్పుడు ఆధార్ కార్డులో ఉన్న పేరుతో పూర్తిగా సరిపోవాలి. పేర్లలో ఏవైనా వ్యత్యాసాలు ఉంటే, దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. దీంతో గుర్తింపు ప్రక్రియ మరింత కచ్చితత్వంతో జరుగుతుందని భావిస్తున్నారు.
పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రోటీన్ ఇ-గవర్నమెంట్ టెక్నాలజీస్ లిమిటెడ్, యుటిఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ లిమిటెడ్, ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. కొత్త ఫారమ్లు కూడా త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.





