వారసత్వ సంపదను రక్షించాలంటూ కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. జాతీయంగా రక్షిత వారసత్వ స్మారక చిహ్నం, వరంగల్ కోట భూములను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ఆస్తిగా గుర్తించిందన్నారు. ఈ నేపథ్యంలోనే అక్రమ నిర్మాణాల తొలగింపు, కోట భూముల నుండి ఆక్రమణదారులను తొలగించడానికి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖలో కోరారు.
2022 నుండి ASI పదే పదే నోటీసులు, జిల్లా కలెక్టర్కు లేఖలు పంపినప్పటికీ స్పందనలేదని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. అసలు ఏడు కోట గోడలలో మూడు మాత్రమే మిగిలి ఉన్నాయన్నారు. అన్యాక్రాంతం అవుతున్న వారసత్వ సంపదను కాపాడాల్సిన బాధ్యత మనపైన ఉందన్నారు. కోటలో జరుగుతున్న ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలను తొలగించడానికి తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి ప్రభావవంతమైన చర్య తీసుకోకపోవడాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పుబట్టారు.
అక్రమణలు, అనధికార నిర్మాణాలు, ఆక్రమణలను నియంత్రించడంలో ASIకి చట్టపరమైన అడ్డంకులను సృష్టిస్తున్నందున, కోట భూములను ప్రభుత్వ భూమికి బదులుగా ASI ఆస్తిగా నమోదు చేయడం ద్వారా రెవెన్యూ రికార్డులను గుర్తించి సరిచేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభ్యర్థించారు.
అనధికార నిర్మాణాలను వెంటనే తొలగించాలని, ఆక్రమణదారుల తొలగింపు, రెవెన్యూ రికార్డులను సరిదిద్దాలని, చట్ట ప్రకారం కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ చారిత్రక, వారసత్వ స్మారక చిహ్నాన్ని రక్షించడానికి ASIకి పూర్తి సహకారాన్ని అందించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
Letter on Warangal Fort
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
