
తక్షణ సందేశాల యాప్ వాట్సాప్ వినియోగదారుల గోప్యతను మరింత బలోపేతం చేసే దిశగా కీలక మార్పులకు సిద్ధమవుతోంది. ఫోన్ నంబర్ను పంచుకోకుండానే ఇతరులతో చాట్ చేసుకునే సదుపాయాన్ని అందించే కొత్త ఫీచర్పై సంస్థ పని చేస్తోంది. ఈ ఫీచర్ అమల్లోకి వస్తే, యూజర్లు ప్రత్యేకమైన యూజర్నేమ్ల ద్వారా ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వగలరు. నివేదికల ప్రకారం ఈ యూజర్నేమ్ ఫీచర్ గ్లోబల్ స్థాయిలో 2026 మధ్యకాలంలో ముఖ్యంగా జూన్ సమయంలో అందుబాటులోకి రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇది చాలా కాలంగా అభివృద్ధిలో ఉన్నప్పటికీ, త్వరలోనే అధికారికంగా విడుదల కానుంది.
ఈ ఫీచర్ విధానం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి ప్లాట్ఫామ్ల మాదిరిగానే ఉంటుంది. వినియోగదారులు తమకు నచ్చిన యూజర్నేమ్ను సృష్టించుకుని, దాని ద్వారా సందేశాలు పంపడం, కాల్స్ చేయడం, కొత్త వ్యక్తులతో కనెక్ట్ అవ్వడం సాధ్యమవుతుంది. అయితే ఈ ఫీచర్ను ఉపయోగించడం పూర్తిగా ఐచ్చికం మాత్రమే. ఫోన్ నంబర్తోనే చాట్ చేయాలనుకునే వారికి ఎలాంటి మార్పు ఉండదు.
ఈ మార్పు ముఖ్యంగా గోప్యత పరంగా పెద్ద ముందడుగు అని భావిస్తున్నారు. వ్యక్తిగత ఫోన్ నంబర్ను తెలియజేయకుండా సంభాషణలు ప్రారంభించగలగడం వల్ల, వ్యాపార చాట్లు, గ్రూప్ సంభాషణలు లేదా కొత్త పరిచయాల సమయంలో వినియోగదారులకు భద్రత పెరుగుతుంది. ఇదే విధమైన సదుపాయాలను ఇప్పటికే టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్లు అందిస్తున్నాయి. ఇదే సమయంలో వాట్సాప్ మరో కొత్త ఫీచర్ అయిన గెస్ట్ చాట్స్ పై కూడా పని చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా ఖాతా లేకుండానే బ్రౌజర్ లింక్ ద్వారా సంభాషణలో చేరే అవకాశం ఉంటుంది. అయితే, గెస్ట్ యూజర్లకు ప్రస్తుతానికి పరిమిత ఫీచర్లు మాత్రమే లభించే అవకాశం ఉంది. అయినప్పటికీ, ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ భద్రతను యథాతథంగా కొనసాగించాలని కంపెనీ యోచిస్తోంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
