
భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు అంతా సిద్ధమైంది. ఈ నెల 27, 28న వైభవంగా జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణం, పట్టాభిషేక మహోత్సవాల టికెట్లను bhadradritemple.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్లో టికెట్ల విక్రయం ప్రారంభించారు ఈవో దామోదర్ రావు. దేశ నలుమూలల నుంచి శ్రీరామనవమికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం ఆన్ లైన్ ద్వారా 10వేల 920 టికెట్లు, నాలుగు ప్రత్యేక కౌంటర్ల ద్వారా 4వేల 665 మాన్యువల్ టికెట్లు విక్రయించనున్నట్టు దేవస్థానం అధికారులు తెలిపారు. కల్యాణోత్సవం ఉభయదాతల టికెట్ 7,500 రూపాయలకు విక్రయిస్తున్నారు. 7,500 టికెట్పై ఇద్దరికి ప్రవేశం ఉంటుంది. వారికి స్వామివార్ల శేష వస్త్రాలైన చీర, పంచె, 400 గ్రాముల కల్యాణ లడ్డూ, కల్యాణ తలంబ్రాల ప్యాకెట్, సచిత్ర రామాయణ పుస్తకం అందిస్తారు. అదే రోజున ప్రధాన ఆలయంలో ధ్రువమూర్తులను దర్శించుకోవచ్చు.
టికెట్లను బుక్ చేసుకునేందుకు ఈ లింక్ ను క్లిక్ చేయండి..
రూ.2,500, 2,000, 1,000, 300, 150,100 విలువైన టికెట్లలో ఏది కొనుగోలు చేసినా ఆ ధరకు సంబంధించిన విభాగంలో ఒకరికి ప్రవేశం ఉంటుంది. ఉత్సవాలకు రాలేని భక్తుల సౌకర్యార్థం గోత్ర నామాలతో కళ్యాణం జరిపించుటకు పరోక్ష సేవల్లో భాగంగా 5వేల రూపాయల నుంచి వెయ్యి నూట పదహార్ల టికెట్ల వరకు ఆన్ లైన్లో అందుబాటులో ఉంచారు దేవస్థానం అధికారులు.
భద్రాచలం రాములవారి కళ్యాణంలోని తలంబ్రాలకు చాలా ప్రత్యేకత ఉంది. భక్తులు వీటిని పవిత్రంగా భావిస్తారు. తలంబ్రాలు కావాలని అందరూ అనుకుంటారు. ఈసారి ఇంటి వద్దే శ్రీరాములవారి కళ్యాణం తలంబ్రాలు పొందవచ్చు. ఆర్టీసీ వెబ్ సైట్లో బుక్ చేసుకుంటే.. స్వామివారి తలంబ్రాలు నేరుగా ఇంటికే పంపేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
